‘‘శభాష్.. వంశీ’’.. టీ-కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారిన మాజీ ఎమ్మెల్యే..!

by Disha Web Desk 19 |
‘‘శభాష్.. వంశీ’’.. టీ-కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారిన మాజీ ఎమ్మెల్యే..!
X

దిశ, డైనమిక్ డెస్క్: టికెట్ రాలేదనే అసంతృప్తితో కొందరు పార్టీలు మారుతున్నారు.. మరికొందరు రెబల్‌గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.. ఇంకొందరు అధికారిక అభ్యర్థిని ఓడించేందుకు పావులు కదుపుతున్నారు.. ఇంకొంతమంది పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు.. పార్టీ ఆఫీసుల్లో నిరసనలు చేస్తున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల్లో ఇలాంటి వాతావరణమే ఉన్నది.

టికెట్ రాలేదన్న అసంతృప్తితో ఉన్న సొంత పార్టీ నేతలను బుజ్జగించడానికి ప్రయత్నాలూ మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో కల్వకుర్తి అసెంబ్లీ టికెట్‌ను పార్టీ నిర్ణయం మేరకు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీచంద్ రెడ్డి భిన్నంగా ఉన్నారంటూ పీసీసీ, ఏఐసీసీ నేతలు ప్రశంసించారు.

కల్వకుర్తి నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఈసారి కూడా టికెట్ ఆశించారు. కానీ స్క్రీనింగ్, సెంట్రల్ ఎలక్షన్ కమిటీలు అవకాశం ఇవ్వలేదు. బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన కసిరెడ్డి నారాయణరెడ్డిని కల్వకుర్తి అభ్యర్థిగా ఖరారు చేశాయి. మనసులో అసంతృప్తి ఉన్నా పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించారు. అధికారిక అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

ఎన్నికల ప్రచారంలో స్వయంగా ఆయనతో కలిసి పాల్గొంటున్నారు. గతంలో తనను దీవించినట్లుగానే ఈసారి కూడా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ఇంటింటికెళ్ళి ప్రజలను రిక్వెస్టు చేస్తున్నారు. టికెట్ రాలేదన్న అసంతృప్తిని పక్కన పెట్టి ‘పార్టీ ఫస్ట్.. పర్సనల్ నెక్స్ట్’ గా భావించి త్యాగం చేయడాన్ని పీసీసీ, ఏఐసీసీ నేతలు ప్రశంసించారు.

రోల్ మోడల్‌గా నిలిచారంటూ ఆ పార్టీ నేతలు పలువురు వంశీచంద్‌రెడ్డిని పొగడ్తల్లో ముంచెత్తారు. తెలంగాణలో ఇప్పుడు టికెట్ ఆశిస్తున్న నేతలకు ఇది ఆదర్శనీయమంటూ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్చి మాణిక్‌రావ్ థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి కితాబునిచ్చారు. ఎమ్మెల్యే టికెట్ కోసం పడరాని పాట్లు పడుతూ పైరవీ చేసుకుంటున్న టైమ్‌లో హైకమాండ్ ఈజ్ అల్టిమేట్.. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్.. అనే తరహాలో పాజిటివ్‌గా ఆలోచించి తన వ్యక్తిగత కోరికకంటే పార్టీ నిర్ణయమే ఫైనల్ అని క్రమశిక్షణతో వ్యవహరించారని రాష్ట్ర, జిల్లా నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ ఆకాంక్షల మేరకు పార్టీని పవర్‌లోకి తీసుకురావడానికి వ్యక్తిగత త్యాగానికి సిద్ధపడిన వంశీచంద్‌రెడ్డి ఇప్పుడు కసిరెడ్డితో కలిసి నియోజకవర్గంలో క్యాంపెయిన్ ముమ్మరం చేశారు.


Next Story

Most Viewed