ఆదాయ వనరుల కోసం మద్యంపై ఆధారపడ్డారు.. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

by Dishafeatures2 |
ఆదాయ వనరుల కోసం మద్యంపై ఆధారపడ్డారు..  మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదాయ వనరులు పెంచుకునేందకు పూర్తిగా మద్యం అమ్మకాలు, భూములు అమ్మకాలపైనే ఆధారపడినట్లు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యసభలోని ఆమె కార్యాలయంలో గురువారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డితో పాటు ఆమెను ఆయన కలిశారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, కేసీఆర్ ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాలపై వారు వివరించారు. స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్రం.. ఆర్థిక సంఘం ద్వారా అందిస్తున్న నిధులను పూర్తిగా పక్కదారి పట్టించారని ఆమెకు వివరించారు. పంచాయతీల జీతభత్యాలు, విద్యుత్తు బిల్లుల కోసం, ట్రాక్టర్ల ఇన్స్టాల్ట్ మెంట్ల కోసం ఆ నిధులను మళ్లిస్తున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఆవాస్ యోజన, సడక్ యోజన, స్మార్ట్ సిటీ పనులకు సంబంధించిన నిధులను కూడా పక్కదారి పట్టించారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయోజత కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయడంలేదని వివరించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అవ్వడంతో ముందస్తుగానే మద్యం టెండర్ల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని చూస్తున్నాడని తెలిపారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో స్థిరాస్తులు తగ్గిపోతున్నాయని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు, ఉద్యోగులకు, విద్యార్థులకు తెలంగాణ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడంపై ఆర్థికపరమైన సమీక్ష నిర్వహించాలని కేంద్రమంత్రిని కోరారు. కాగా ప్రభుత్వశాఖల పరంగా సమీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని కేంద్ర మంత్రి తమకు చెప్పారని ప్రభాకర్ తెలిపారు.


Next Story

Most Viewed