‘మురళీధర్ రావుకు నేను బినామీ కాదు’.. మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి క్లారిటీ

by Gantepaka Srikanth |

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌రావు(Muralidhar Rao)ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

‘మురళీధర్ రావుకు నేను బినామీ కాదు’.. మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌రావు(Muralidhar Rao)ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ను చంచల్‌గూడ జైల్లో పెట్టి.. న్యాయస్థానం అనుమతితో విచారిస్తున్నారు. ఆదాయ వనరులకు ఆధారాలేమిటో చెప్పాలని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆయన పేరిట, కుటుంబసభ్యుల పేర్లపైనా ఆస్తులను ఎలా సమకూర్చుకున్నారనే కోణంలో మురళీధర్‌రావును అడిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. చంచల్‌గూడ జైలులో మురళీధర్‌రావుతో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి(Kandala Upender Reddy) రెండుసార్లు ములాఖత్‌ కావడం చర్చనీయాంశంగా మారింది. మురళీధర్‌రావు జైలుకు వెళ్లిన మొదటిరోజే ఆయన ములాఖత్‌పై కలిశారు. దీంతో మురళీధర్ రావును మాజీ ఎమ్మెల్యే బినామీగా ఉన్నాడంటూ వార్తలు విస్తృతమయ్యాయి. తాజాగా ఈ వార్తలపై కందాళ ఉపేందర్ రెడ్డి స్పందించారు. శుక్రవారం ఉపేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘మురళీధర్ రావుకు తాను బినామీని కాదు. మురళీధర్ రావుతో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు. కానీ ఆయనకు, నాకు 45 ఏళ్లుగా స్నేహం ఉంది. మురళీధర్ రావు కుటుంబ సభ్యులు అడిగితే.. జైలుకు తీసుకెళ్లి ములాఖత్‌లో కల్పించాను. అంతకుమించి ఇంకేం లేదు’ అని కందాళ ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story