సీపీఐ ఆఫీసుకు మాజీ మావోయిస్టు అగ్రనేతలు.. క్లారిటీ ఇచ్చిన దేవ్ జీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-30 16:01:48  IST  )

అడవి బాట వీడి జనజీవన స్రవంతిలో కలిసి మాజీ మావోయిస్టులు కమ్యూనిస్టుల మాతృ సంస్థ అయిన సీపీఐలో చేరాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు మరోసారి ఆహ్వానం పలికారు.

సీపీఐ ఆఫీసుకు మాజీ మావోయిస్టు అగ్రనేతలు.. క్లారిటీ ఇచ్చిన దేవ్ జీ
X
  • మతోన్మాద, ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడేది కమ్యూనిస్టులే : కూనంనేని సాంబశివరావు
  • మర్యాదపూర్వక భేటిీనే : దేవ్ జీ

దిశ, తెలంగాణ బ్యూరో: అడవి బాట వీడి జనజీవన స్రవంతిలో కలిసి మాజీ మావోయిస్టులు కమ్యూనిస్టుల మాతృ సంస్థ అయిన సీపీఐలో చేరాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు మరోసారి ఆహ్వానం పలికారు. మాజీ మావోయిస్టులు దేవజీ(తిప్పిరి తిరుపతి), మల్లా రాజిరెడ్డి(సంగ్రామ్‌), పుల్లూరి ప్రసాద్‌ రావు (చంద్రన్న) శనివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్యద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు సీపీఐ నేతలతో సమావేశమైయ్యారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కగార్‌ అపరేషన్‌కు వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం, తదితర వామపక్షపార్టీలతో పాటు ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు, మేధావులు అనేకమంది అనేక రూపాలలో ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అడవుల్లో ఉన్న మావోయిస్టుల ప్రాణాలు కాపాడబడాలని కోరుకున్నారని తెలిపారు. ఎన్‌కౌంటర్‌ పేరుతో ఏమి చేస్తారో తెలియని భయానక పరిస్థితుల్లో పాత్రికేయులు సహా అందరూ ఆందోళన వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే జన జీవన స్రవంతిలో కలిసి ఈ ముగ్గురు నేతలు కమ్యూనిస్టు పార్టీగా, కమ్యూనిజం పట్ల అభిమానం కలిగినవారుగా సీపీఐ కార్యాలయానికి రావాలనుకున్నారని, అయితే అప్పుడు సమయం కుదరకపోవడంతో ఇప్పుడు వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా తమ కార్యాలయానికి వచ్చిన ఆ ముగ్గురుకి సీపీఐ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలిపింది. ప్రస్తుతం తమ మధ్య మర్యాదపూర్వక సమావేశం జరిగిందని రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు జరిపి, వారి భవిష్యత్తు ఏమిటి అనే దానిపై చర్చిస్తామని తమ ఆలోచనలను వారితో పంచుకుని, తెలంగాణకి, దేశానికి మంచి జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని కూనంనేని వెల్లడించారు. తద్వారా దేశంలో మతోన్మాద, ఫాసిస్ట్‌ శక్తులకు వ్యతిరేకంగా బలంగా నిలబడగల శక్తి కమ్యూనిస్టు ఉద్యమానిదేనని అభిప్రాయపడ్డారు. త్వరలో అందరూ కలిసి మరోసారి సమావేశమై తమ రాజకీయ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడిస్తారని కూనంనేని సాంబశివరావు చెప్పారు. దేవ్‌జీ మాట్లాడుతూ సీపీఐ నేతలను తాము కేవలం మర్యాదపూర్వకంగా కలిసేందుకు మాత్రమే వచ్చామని వెల్లడించారు.

Next Story