కేసీఆర్‌ను లొంగదీసుకోవడానికే కవిత అరెస్ట్: ప్రధాని మోడీపై గొంగిడి సునీత ఫైర్

by Disha Web Desk 19 |
కేసీఆర్‌ను లొంగదీసుకోవడానికే కవిత అరెస్ట్: ప్రధాని మోడీపై గొంగిడి సునీత ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ప్రధాని మోడీ దర్యాప్తు సంస్థలతో వేధిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ను లొంగదీసుకోవడానికి ఆడబిడ్డ అని కూడా చూడకుండా లిక్కర్ కేసులో కవితను మోడీ అరెస్టు చేయించారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్‌పై మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. ఓ గల్లీ నాయకుడిలా ఆయన ప్రవర్తన ఉందని మండిపడ్డారు. కుటుంబ పార్టీలు అవినీతిలో కూరుకు పోతున్నాయని మోడీ అంటున్నారు, లిక్కర్ కేసును బీఆర్ఎస్‌కు ఆపాదిస్తున్నారు, ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా మోడీ మా పార్టీపై నిందలు ఎలా వేస్తారని ఆమె నిప్పులు చెరిగారు. మోడీ తనకు నచ్చిన పార్టీలను ఒకలా నచ్చని పార్టీలను మరోలా విమర్శిస్తారని ధ్వజమెత్తారు.

ప్రధాని మోడీ కార్పొరేట్ సంస్థలకు ఏజెంట్‌గా పని చేస్తున్నారని ఆరోపించారు. భ్రష్టాచార్ హటావో అంటూ దేశాన్ని మోడీ భ్రష్టు పట్టించారన్నారు. బీజేపీలో నేరస్థులు చేరితే పరమ పవిత్రులు అవుతారా అని ప్రశ్నించారు. కవిత రిమాండ్ రిపోర్ట్‌లో తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కూతురు అని రాజకీయ దురుద్దేశం తో ప్రస్తావించారు.. ఇలా రాయడం ఏ కేసులో ఉండదన్నారు. ఇదొక్కటి చాలు బీజేపీ దురుద్దేశం లోకానికి తెలియడానికని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత తెలంగాణ ఉద్యమ కారిణి.. రాష్ట్ర సాధనలో ఆమె కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. లిక్కర్ కేసులో కవిత నిర్దోషిగా బయట పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఈడీ కేసు కాదు.. ప్రధాని మోడీ కేసని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీకి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.


Next Story