ఫారెస్ట్ VS రెవెన్యూ.. విస్తరణ పనులతో వార్

by Disha Web Desk 4 |
ఫారెస్ట్ VS రెవెన్యూ.. విస్తరణ పనులతో వార్
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో అటవీశాఖ, రెవెన్యూ శాఖ మధ్య భూ వివాదాలు తలెత్తుతున్నాయి. కొద్ది నెలల క్రితం ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని గట్టమ్మ వద్ద సమీకృత కలెక్టర్ భవన నిర్మాణం కోసం కేటాయించిన భూమి విషయంలో ఫారెస్ట్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది మధ్య వివాదంతో పనులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. ఫారెస్ట్ సిబ్బంది ఆ స్థలంలో పనిచేస్తున్న యంత్రాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం ఉదయం జాతీయ రహదారి 163 విస్తరణ పనుల్లో భాగంగా మల్లంపల్లి నుంచి జాకారం మధ్యలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది అటవీ శాఖ అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారంటూ జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు.

విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు వెడల్పు కోసం కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని, మల్లంపల్లి జాకారం వరకు రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ భూములు ఉన్నాయని, ప్రభుత్వ భూముల్లో పని జరుగుతుండగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం సరికాదని వాదిస్తున్నారు. ఏది ఏమైనా ములుగు జిల్లాలో ఫారెస్ట్ శాఖ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇలాంటి సమస్యలు పునరావృతం అవుతున్నాయని జిల్లా ప్రజలు అనుకుంటున్నారు.

అటవీ భూముల్లో అనుమతించం..

జాతీయ రహదారి 163 విస్తరణ కోసం మల్లంపల్లి నుంచి జాకారం వరకు అటవీ భూముల్లో అనుమతి లేకుండా పనులు నిర్వహిస్తున్నారు. రోడుకు ఇరువైపులా చెట్లను నరుకుతుండగా రోడ్డు పనులను నిలిపివేసి మూడు జేసీబీలను స్వాధీనం చేసుకున్నాం. పంచనామా నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తాం.

-ములుగు ఎఫ్ఆర్ఓ శంకర్

ప్రభుత్వ భూమిలోనే పనులు జరుగుతున్నాయి..

జాతీయ రహదారి విస్తరణ పనులు అన్ని అనుమతులతోనే జరుగుతున్నాయి. మల్లంపల్లి నుంచి జాకారం వరకు రోడ్డు ఇరువైపులా ప్రభుత్వ భూమిలోనే పనులు జరుగుతున్నాయి. 53/2నుంచి 53/19 వరకు, 67/2నుంచి 67/19 వరకు సర్వే నెంబర్లలో, పాత, కొత్త రికార్డుల్లో, మ్యాప్‌ల్లో సైతం ప్రభుత్వ భూమిగా నమోదై ఉంది.

-ములుగు ఎమ్మార్వో సత్యనారాయణ


Next Story

Most Viewed