ఐఎఫ్ఎస్ అధికారి వేధింపులు భరించలేకున్నా.. సూపరింటెండెంట్ జయలక్ష్మి ఆరోపణలు

by Web Desk |
ఐఎఫ్ఎస్ అధికారి వేధింపులు భరించలేకున్నా..  సూపరింటెండెంట్ జయలక్ష్మి ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫారెస్టు డిపార్టుమెంట్‌లో ఉన్నత అధికారి తనను వేధింపులకు గురిచేస్తున్నారని సూపరింటెండెంట్ జయలక్ష్మి ఆరోపించారు. డిపార్టుమెంట్‌లో 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నానని, 2013 నుంచి సూపరింటెండెంట్ హోదాలో ఉన్న తనను ఎదగనివ్వకుండా ఉద్దేశపూర్వకంగానే ఐఎఫ్ఎస్ అధికారి డోబ్రియల్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. శాఖాపరమైన అంశాల్లో 2015 నుంచి తనను అత్యంత హేయంగా వేధిస్తున్నారని మీడియా సమావేశంలో ఆమె ఆరోపించారు. ఆ అధికారి పెడుతున్న ఇబ్బందులతో మానసిక క్షోభను అనుభవించలేక ఆరేళ్ళ సర్వీసు ఉన్నా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు. ఇప్పటికైనా ఆ అధికారి మీద శాఖాపరమైన దర్యాప్తు జరిపి తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు

పని స్థలాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రభుత్వం ప్రత్యేకంగా 'వర్క్ ప్లేస్ హరాస్మెంట్' చట్టాన్ని తీసుకొచ్చినా దానిని కూడా డోబ్రియల్ ఉల్లంఘిస్తూ అనుకూలంగా మల్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను లేవనెత్తిన ఆరోపణలు పై స్థాయి అధికారులకు చేరకుండా తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. ఫారెస్టు సూపరింటెండెంట్‌గా తనకు 32 నెలలుగా జీతం కూడా రావడంలేదని, ఆత్మాభిమానంతో బ్రతకడం కోసమే వీఆర్ఎస్ తీసుకుంటున్నట్లు తెలిపారు. డోబ్రియల్ వేధింపులను తట్టుకోలేక కొత్త ప్రాంతానికి వెళ్ళాలని వేడుకుంటే చివరకు గతంలో పని స్థలంలో వేధింపులు ఎదుర్కొన్న ప్రాంతానికే పంపారని, ఇప్పుడు కొత్త జోనల్ విధానంలో భాగంగా తాను హైదరాబాద్‌ వెళ్ళడానికి ఆప్షన్ ఇస్తే దాన్ని తిరస్కరించి భువనగిరికి పోస్టింగ్ ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. దాదాపు ఐదారేళ్ళుగా ఆయనపై కొట్లాడిన తనకు ఇకపై శక్తి లేకపోవడంతో విధుల నుంచి నిష్క్రమించడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చానని వివరించారు.

Next Story

Most Viewed