ఫుడ్ ఎకోసిస్టమ్‌ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం: శ్రీధర్‌బాబు

by Gantepaka Srikanth |

ఆధునిక, స్థిరమైన, ఆవిష్కరణలకు ప్రాధాన్యత నిచ్చే ఫుడ్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

ఫుడ్ ఎకోసిస్టమ్‌ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం: శ్రీధర్‌బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆధునిక, స్థిరమైన, ఆవిష్కరణలకు ప్రాధాన్యత నిచ్చే ఫుడ్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆహార-పానీయ (ఫుడ్ అండ్ బేవరేజ్) ట్రేడ్ ఫెయిర్‌గా గుర్తింపు పొందిన ఫుడ్ ఎ ఫేర్-2025 నగరంలోని హైటెక్స్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఫెయిర్‌ను మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్, పారిశ్రామిక వేత్తల అభివృద్ధి, టెక్నాలజీ అనుసరణ, మార్కెట్ అభివృద్ధి వంటి కీలక రంగాల్లో దృష్టి సారించడం ద్వారా ఆహార వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు రాష్ట్రాన్ని ప్రధాన కేంద్రంగా నిలపడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. హైదరాబాద్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే ముఖ్యమైన అడుగుగా ఈ ఫుడ్ ఎ ఫెయిర్ నిలుస్తోందన్నారు. రిటైలర్లు, హోల్‌ సెల్లర్లు, తయారీదారులు, ఫుడ్ ప్రాసెసర్లు, టెక్నాలజీ ఇన్నోవేటర్లు, షెఫ్స్, వంట నిపుణులు, స్టార్టప్‌లు, కొనుగోలుదారులు అంతా ఒకే వేదికపైకి రావడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎడిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఫుడ్ ఎ ఫెయిర్ కలినరీ కార్నర్‌ను మొదటిసారి ప్రవేశపెట్టామని చెప్పారు.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ షెఫ్స్ లైవ్ కుకింగ్ డెమోస్, ప్రత్యేకంగా ఎంపిక చేసిన టేస్టింగ్ సెషన్లు, ప్రాంతీయ వంటకాల వైభవ ఆవిష్కరణలను చక్కటి వేదికగా నిలుస్తుందన్నారు. ఆధునిక వ్యాపారం, ఫుడ్ ఇన్నోవేషన్, విలువ పెంపు, మార్కెట్ యాక్సెస్ మధ్య గల దూరాలను తగ్గిస్తూ, కొత్త ట్రెండ్లు, టెక్నాలజీలు, వ్యాపార అవకాశాలను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో ఈ ఫెయిర్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బి2బి మీటింగులు, ప్రొడక్ట్ లాంచ్‌లు, డిమాన్ స్ట్రేషన్స్, ఇండస్ట్రీ ఇంటరాక్షన్లు ఉంటాయని వెల్లడించారు. బ్లిట్జ్ ఎగ్జిబిషన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫెయిర్‌కు తెలంగాణ ప్రభుత్వ ఎమ్ఎస్ఎమ్ఈ శాఖ, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ సహకారం అందిస్తున్నాయని చెప్పారు. అలాగే వైబ్రంట్ ఇండియా, హైటెక్స్‌లు కూడా నిర్వహణలో భాగం పంచుకుంటున్నాయని వివరించారు. కాగా.. ఈ ఫెయిర్‌లో కొలువుదీరిన వినూత్న ఉత్పత్తులు, విశేషాలు ఆకట్టుకున్నాయి. వీటిలో ప్లాంట్-బేస్డ్ ఆహార పదార్థాలు, ఆర్గానిక్ అండ్ మిల్లెట్‌ ఆధారిత ఉత్పత్తులు, ఫంక్షనల్ ఫుడ్స్, తాజా వ్యవసాయ ఉత్పత్తులు, ఫ్రోజెన్ ఫుడ్స్, పాలు అండ్ పాల ఆధారిత పదార్థాలు, మసాలాలు, రెడీ టు ఈట్ ఉత్పత్తులు వంటివి ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాడ్మింటన్ చీఫ్ నేషనల్ కోచ్, పద్మభూషణ్ పుల్లెల గోపిచంద్, ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ డైరెక్టర్ డా.తారా సత్యవతి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, న్యూట్రిహబ్ సీఈఓ జె.స్టాన్లీ, మిల్లెట్ బ్యాంక్ ఫౌండర్ విశాలరెడ్డి, ప్రగతి గ్రూప్ చైర్మన్ జీబీకే రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story