టీఆర్ఎస్‌ పార్టీకి తొలి ఝలక్.. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడి రాజీనామా

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-01 19:37:14  IST  )

కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది.

టీఆర్ఎస్‌ పార్టీకి తొలి ఝలక్.. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడి రాజీనామా
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రక్షణ సేన పార్టీకి మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకట్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన టీఆర్ఎస్ చీఫ్ కవితకు రాజీనామా లేఖ పంపించారు. ఈ సందర్భంగా ఆయన ‘దిశ’తో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ లేదని ఆరోపించారు. కొన్ని కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా.. ఎప్పటికైనా కవిత మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని కీలక ఆరోపణలు చేశారు. పార్టీలో మెదటి నుండి పనిచేసిన వారిని పక్కన పెట్టి.. దందాలు, భూ కబ్జాలు, వసూళ్లు చేసే వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. తనతోపాటు చాలా మంది ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని.. త్వరలోనే వారంతా బయటకు వచ్చేస్తారని వెల్లడించారు.

కవిత చుట్టూ ఉన్నా వాళ్లే పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారని.. వాళ్లే బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్‌లుగా ఉన్నారని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తాను జాగృతి జిల్లా అధ్యక్షుడిగా.. ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ ఇన్‌చార్జిగానూ కొనసాగానని తెలిపారు. పార్టీ ఆవిర్భావం సభను సైతం తానే అంతా మీదేసుకొని సక్సెస్ చేశానన్నారు. ఇన్‌చార్జిగా పార్టీ కార్యక్రమాలకు తనకు కనీసం ఆహ్వానం ఇవ్వలేదన్నారు. తన పరిధిలో ఏ కార్యక్రమం నిర్వహించినా తనకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఆమె కొన్ని తెలుసుకొని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా.. తనకు ఈటల రాజేందర్‌తో తొమ్మిదేళ్ల అనుబంధం ఉన్నదని.. గతంలోనూ ఈటలతో కలిసి పనిచేశానని వెల్లడించారు. తదుపరి తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు.

Next Story