చేతివృత్తులు క్రమంగా క్షీణిస్తున్నాయి.. అక్కినేని అమల కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

సాంప్రదాయ చేతివృత్తులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అమల అక్కినేని అన్నారు.

చేతివృత్తులు క్రమంగా క్షీణిస్తున్నాయి.. అక్కినేని అమల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సమీపంలోని ఇందిరా మహిళా శక్తి బజార్‌లో ఇండియా హ్యాండ్ మేడ్ కలెక్టివ్ (IHMC), సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) సంయుక్త ఆధ్వర్యంలో హస్తకళల ప్రత్యేక ప్రదర్శన ప్రారంభమైంది. చేతివృత్తిదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం, వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపడం, హస్తకళలకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని సినీనటి, ఎనిమల్ రైట్స్ కార్యకర్త అమల అక్కినేని, SERP సీఈఓ దివ్య దేవరాజన్, టెక్స్టైల్ నిపుణులు మరియు CCT వ్యవస్థాపక సభ్యురాలు విజయలక్ష్మి నార్నే, వ్యవసాయ శాస్త్రవేత్త మరియు CSA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జి.వి. రామంజనేయులు ప్రారంభించారు. అనంతరం ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌తో పాటు విక్రయాలతో కూడిన ప్రత్యేక ప్రదర్శనను వారు సందర్శించారు.

చేతివృత్తులను ప్రోత్సహించడం మంచి పరిణామం

ఈ సందర్భంగా మాట్లాడిన అమల అక్కినేని సాంప్రదాయ చేతివృత్తులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు. భారతీయ సంప్రదాయాలకు ప్రతీకలైన చేతివృత్తులు మన సంస్కృతికి అద్దం పట్టేవని, వాటి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక కుటుంబాలు తరతరాలుగా చేతివృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని, యంత్రాల ఆధిపత్యం పెరగడంతో ఈ వృత్తులు క్రమంగా క్షీణిస్తున్నాయని తెలిపారు. చేతివృత్తుల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పిస్తే కళాకారులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. యువత చేతివృత్తుల వైపు ఆకర్షితులయ్యేలా శిక్షణ, ప్రోత్సాహకాలు అవసరమని సూచించారు. SERP సీఈఓ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇందిరా మహిళా శక్తి బజార్‌గా అభివృద్ధి చెందిన ఈ ప్రాంగణం ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురై వివాదాల్లో చిక్కుకుందని తెలిపారు. ఈ స్థలాన్ని వేలం వేస్తే రూ.500 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క మహిళల సాధికారత కోసం దీన్ని మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఒకప్పుడు చెత్త మైదానంలా కనిపించిన ఈ స్థలాన్ని గ్రామీణ మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించుకునే కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సుమారు రూ.9 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మధ్యవర్తులు లేకుండా లాభాలు నేరుగా ఉత్పత్తిదారులైన మహిళలకే చేరేలా ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళా సంఘాలకు షాపులను ఉచితంగా కేటాయించినట్లు పేర్కొన్నారు.

IHMC తెలంగాణ చాప్టర్‌లో చేతితో నేసిన వస్త్రాలు, సహజ వర్ణాలతో తయారైన దుస్తులు, అలంకరణ వస్తువులు, సహజ ఫైబర్ కళాకృతులు, మట్టి ఆభరణాలు, లాకర్ బొమ్మలు, వంట సామగ్రి, సహజ పదార్థాలతో తయారైన చర్మ సంరక్షణ ఉత్పత్తులు, ప్రత్యేక గిఫ్ట్ కాంబినేషన్లు అందుబాటులో ఉంచారు. భారతీయ చేతివృత్తుల వైభవాన్ని ప్రజలకు పరిచయం చేయడం కోసం ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌తో పాటు పలు శిక్షణా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ఈ బజార్‌ను సందర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం IHMCతో అనుబంధంగా ఉన్న సంస్థలు సుమారు 2,500 మంది గ్రామీణ చేతివృత్తిదారులతో కలిసి పనిచేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో MRDUకు చెందిన ఉదయ దైతి, సుకల్ప సంస్థకు చెందిన సర్వాణి, తులా ఆర్గానిక్ క్లాతింగ్‌కు చెందిన జాహ్నవి, ఎలిఫెంట్ ఇన్ యూ సంస్థకు చెందిన అలంకృత, టింక్టోరియా సంస్థకు చెందిన సవిత తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు హాజరై తమ ఉత్పత్తులను ప్రదర్శించారు.

Next Story