రూ. 6వేల కోసం గొడవ.. సహజీవనం చేస్తున్న మహిళ..

by Disha Web Desk 4 |
రూ. 6వేల కోసం గొడవ.. సహజీవనం చేస్తున్న మహిళ..
X

దిశ, కామారెడ్డి రూరల్ : రూ.6వేల కోసం ఇంటికి నిప్పు పెట్టాడు ఓ వ్యక్తి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు గంట పాటు శ్రమించి మంటలను ఆర్పేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో ఆదివారం అర్ధ రాత్రి చోటు చేసుకుంది. ఓ మహిళా కూలీ గత రెండు సంవత్సరాలుగా నారాయణ అనే మేస్త్రితో సహజీవనం చేస్తుంది.

మహిళకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నారాయణ రూ.6వేలను సదరు మహిళకు ఇంటి కిరాయి నిమిత్తం ఇచ్చాడు. ఆదివారం రాత్రి నారాయణ ఫుల్ గా మద్యం సేవించి ఇంటికి వచ్చి మహేశ్వరితో గొడవపడి రూ.6వేలు ఇవ్వాలని తీవ్రంగా చితకబాదాడు. దీంతో మహేశ్వరి భయంతో తన ఇద్దరు కుమారులను తీసుకొని బయటకు వెళ్ళింది. అనంతరం నారాయణ ఇంటికి నిప్పు పెట్టి తాళం వేసుకొని వెళ్లాడు. దీన్ని గమనించిన స్థానికులు నారాయణను పట్టుకుని దేహశుద్ధి చేశారు.

అనంతరం పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు గంట పాటు శ్రమించి మంటలను ఆర్పి వేశారు. అలాగే ఇంట్లో ఉన్న మూడు గ్యాస్ సిలిండర్ లను బయటకు తీసుకువచ్చారు. సంఘటన స్థలానికి డీఎస్పీ సురేష్, ఎస్ ఐ హైమాద్‌లు చేరుకొని పరిస్థితి సమీక్షించారు. తీవ్రంగా గాయపడిన నారాయణను అంబులెన్స్‌లో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed