ఎన్డీయే కూటమికి ఓటమి భయం : బీహార్ ఎన్నికల ప్రచారంలో పొంగులేటి

by Muthe.Rajitha |

రెండు ద‌శాబ్దాలపాటు అవినీతి, అక్రమాలు అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌తో బిహార్ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుప‌డింద‌ని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడు, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఆరోపించారు.

ఎన్డీయే కూటమికి ఓటమి భయం : బీహార్ ఎన్నికల ప్రచారంలో పొంగులేటి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు ద‌శాబ్దాలపాటు అవినీతి, అక్రమాలు అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌తో బిహార్ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుప‌డింద‌ని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడు, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఆరోపించారు. బిహార్ రాష్ట్రం ప‌శ్చిమ చంపార‌న్ జిల్లా చనుపటియా అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో కలిసి పొంగులేటి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్డీయే కూట‌మికి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని.. అందువ‌ల్లే అల‌వికాని హామీల‌ను ఇస్తున్నద‌ని విమ‌ర్శించారు.

వారి ఎన్నిక‌ల ప్రణాళిక‌లో కోటి వ‌రాలు ప్రక‌టించ‌డం, యువ‌త‌కు కోటి ఉద్యోగాలు, కోటి మంది లక్‌ప‌తి దీదీలు హామీలు ఇచ్చార‌ని.. అధికారంలో ఉన్న ఈ 20 సంవ‌త్సరాల‌లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత‌మంది దీదీల‌ను ల‌క్‌ప‌తులుగా చేశార‌ని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వీటిని అమ‌లు చేయ‌లేద‌ని ప్రశ్నించారు. బిహార్ ప్రజ‌ల‌ను కొత్త కొత్త హామీల‌తో మ‌భ్యపెట్టే ప్రయ‌త్నం చేస్తున్నార‌ని విమర్శించారు.

మ‌హాగ‌ఠ్ బంధ‌న్‌ను గెలిపిస్తే తెలంగాణ మోడ‌ల్ పాల‌న‌ను బిహార్‌లో అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అభివృద్ధి, సంక్షేమానికి స‌మ ప్రాధాన్యత‌ను ఇస్తూ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేస్తున్నద‌ని వివ‌రించారు. రైతుల‌కు రుణ‌మాఫీ, 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్‌, 500 రూపాయల‌కే సిలిండ‌ర్‌, ఉచిత బ‌స్సు ప్రయాణం, అర్హులైన పేద‌లంద‌రికీ ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం వంటి హామీల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని వివ‌రించారు.

బిహార్ ప్రజ‌లు ఈసారి విజ్ఞత‌తో ఆలోచించి మ‌హాగ‌ఠ్ బంధ‌న్‌కు అండ‌గా నిల‌వాల‌ని విజ్ఞప్తి చేశారు. మ‌హాగ‌ఠ్ బంధ‌న్‌ను గెలిపిస్తే యువ‌కుడైన తేజ‌స్వియాద‌వ్ ముఖ్యమంత్రి అవుతార‌ని చెప్పారు. ఏన్డీయే కూట‌మి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవ‌ర‌న్న విష‌యాన్ని ప్రక‌టించలేని దుస్థితిలో ఉంద‌ని విమ‌ర్శించారు. ఈ బహిరంగ సభలో బిహార్ రాష్ట్ర ఇన్‌చార్జ్ కృష్ణ అల్వర్, ఎంజీబీ అభ్యర్థి అభిషేక్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story