వర్షాలు లేక ఎండుతున్న పంటలు.. ఆందోళనలో రైతులు

by Disha Web Desk 7 |
వర్షాలు లేక ఎండుతున్న పంటలు.. ఆందోళనలో రైతులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఈసారి వర్షాలు అధికంగా కురుస్తాయని ఆశలు పెట్టుకున్న రైతాంగానికి జూలై, ఆగస్టు నెలలు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, దానికి తోడు ఎండాకాలాన్ని తలపించేలా ఎండలు ఉండటంతో గాలిలో తేమ శాతం తగ్గి పైర్లు ఎండిపోతున్నాయి. వారం పది రోజుల్లో వర్షాలు కురవకుంటే ప్రస్తుతం వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉండటంతో రైతాంగానికి దిక్కుతోచడం లేదు. ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన స్థాయిలో రైతులు సాగుకు మొగ్గుచూపడం లేదు. అందుకు కారణం సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పాటు రైతు ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా తయారుకావడమే కారణమన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది.

15 రోజులుగా వర్షాల్లేవ్..

రాష్ట్ర వ్యవసాయ శాఖ ఐదు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నది. ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 4.96 లక్షల ఎకరాల్లోని మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, వరి, పెసర, కంది, జొన్న పంటలు ఎండిపోతున్నాయని తెలిపింది. 15 రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని తన నివేదికలో పేర్కొంది. దీంతో జిల్లా వ్యవసాయాధికారుల నేతృత్వంలో కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే), తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, స్థానిక అధికారులతో కలిపి సంయుక్త బృందాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశించింది. వర్షాభావంతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించాలని సూచించింది. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పేర్కొన్నది.

తగ్గిన పంటల సాగు..

రాష్ట్రంలో 81 శాతం విస్తీర్ణంలో అన్ని రకాల పంటలను సాగు చేశారు. 1.07 కోట్ల ఎకరాల్లో సాధారణంగా పంటల సాగు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 86.54 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. అందులో ఆహార ధాన్యాల సాగు 48.11 లక్షల ఎకరాల్లో కావాల్సి ఉండగా ఇప్పటివరకు 43.54 లక్షల ఎకరాల్లో 90 శాతం సాగయ్యింది. అందులో వరి సాధారణ విస్తీర్ణం 24.35 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 12.62 లక్షల ఎకరాల్లో 52శాతం మాత్రమే నాట్లు వేశారు. వర్షాలు లేకపోవడం ముఖ్య కారణం కాగా భూగర్భ జలాలు పెరగకపోవడం, జలాశయాల్లోకి నీరు గరిష్ట స్థాయిలోకి రాకపోవడం మరో కారణమని తెలుస్తోంది. ఖరీఫ్‌లో పప్పుధాన్యాలు, మొక్కజొన్న సహా కొన్ని పంటలు మాత్రమే సాధారణం కంటే అధికంగా సాగుచేశారు.

ఆగస్టులో 58 మిల్లీ మీటర్లే..

ఆగస్టు నెలలో 171 .4 మిల్లీ మీటర్ల వర్షపాతానికి గాను కేవలం 58 మిల్లీ మీటర్లే నమోదైంది. జూన్‌లో సాధారణ వర్షపాతం 127.6 మిల్లీమీటర్లు కాగా 190.9 మిల్లీ మీటర్లు కురిసింది. మొత్తంగా ఈ మూడు నెలల కాలంలో మెదక్, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో లోటు, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.



Next Story

Most Viewed