HYD: ముగిసిన ఫేర్‌వెల్‌ మ్యాచ్‌.. సానియా మీర్జా కంటతడి

by Disha Web Desk 2 |
HYD: ముగిసిన ఫేర్‌వెల్‌ మ్యాచ్‌.. సానియా మీర్జా కంటతడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ ముగిసింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన ఫేర్‌వెల్ మ్యాచ్‌లో సానియా మిర్జా విజయం సాధించింది. మ్యాచ్‌ అయిపోగానే ఒక్కసారిగా సానియా భావోద్వేగానికి గురైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత కంటతడి పెట్టింది. అనంతరం మీడియాతో మాట్లాడిన సానియా...‘అభిమానుల కోసం చివ‌రి మ్యాచ్ ఆడాను. 20 ఏళ్ల క్రితం నేను ఎక్క‌డ టెన్నిస్ ప్రాక్టీస్ చేశానో అక్క‌డే ఆఖ‌రి మ్యాచ్ ఆడాను. ఈ మ్యాచ్ చూసేందుకు నా కుటుంబ సభ్యులు, స్నేహితులు వ‌చ్చారు. కెరీర్‌లో చివ‌రి మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎద‌రు చూశా. విజ‌యంతో కెరీర్‌ను ముగించాలని అనుకున్నాను. నా కుమారుడు, కుటుంబంతో స‌మ‌యం కేటాయించాలని అనుకుంటున్నా’ అని సానియా మీర్జా తెలిపింది.

కాగా, ఇప్పటికే టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా.. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా తన చివరి మ్యాచ్‌ ఆడింది. డబుల్స్‌ మ్యాచ్‌ సానియా, బోపన్న- ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీ మధ్య జరిగింది. సింగిల్స్‌లో రోహన్‌ బోపన్నతో సానియా తలపడింది. సానియా చివరి మ్యాచ్‌ను వీక్షించేందుకు పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. మంత్రి కేటీఆర్‌తో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్‌సింగ్‌, అజారుద్దీన్‌ తదితరులు సానియా మ్యాచ్‌ను వీక్షించారు. పెద్దఎత్తున అభిమానులు తరలిరావడంతో స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మ్యాచ్‌ అనంతరం సాయంత్రం ఓ ప్రైవేట్‌ హోటల్‌లో రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్‌, గాలా డిన్నర్‌ జరగనుంది. సాయంత్రం గాలా డిన్నర్‌కు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు, సినీ, క్రీడా ప్రముఖులు మహేశ్‌బాబు, ఏఆర్‌ రెహమాన్‌, సురేష్‌రైనా, జహీర్‌ఖాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ తదితరులు హాజరుకానున్నారు.

Next Story

Most Viewed