పవర్ కట్ పై ఫేక్ న్యూస్.. అడ్రస్ అడిగేసరికి పరార్

by Disha Web Desk 13 |
పవర్ కట్ పై ఫేక్ న్యూస్.. అడ్రస్ అడిగేసరికి పరార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై ఫేక్ ప్రచారం కలకలం రేపుతున్నది. తమ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కొందరు పోకిరీలు సోషల్ మీడియాలో వేదికగా ఫేక్ అకౌంట్లతో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నట్టు టీఎస్ ఎస్పీడీసీఎల్ అధికారులు గుర్తించారు. కొంత మంది కరెంట్ కోతలపై తప్పుడు ప్రచారం చేస్తుంటే వాటికి మరికొందరు క్షణాల్లోనే వత్తాసు పలుకుతుండటంతో ఈ ఫేక్ ప్రచారం వ్యవహారం సంస్థకు సవాలుగా మారింది. ‘పవర్ లేక ఈ రోజు లిఫ్ట్ అవుట్ ఆఫ్ ఆర్డర్.. రేపు కంపెనీ/ ఇండస్ట్రీ అవుట్ ఆఫ్ ఆర్డర్.. ఎల్లుండి రాష్ట్రమే అవుట్ ఆఫ్ ఆర్డర్’ అనే హెడ్డింగ్ లతో విద్యుత్ సరఫరా సంస్థపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ ఫేక్ ప్రచారాన్ని కట్టడి చేసేందుకు సంస్థ ప్రత్యేకంగా ఇద్దరు సిబ్బందిని నియమించి సోషల్ మీడియాలో వస్తున్న ఇటువంటి అంశాలపై వెంటనే రియాక్ట్ అవుతోంది. విద్యుత్ సరఫరా లేదంటూ పోస్టులు చేయగానే అప్రమత్తమవుతున్న సిబ్బంది చిరునామాతో పాటు అదనపు సమాచారం ఇవ్వాలని కోరగా అందుకు పోకిరీలు ఆ పోస్టులను డిలీట్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం విద్యుత్ సంస్థల్లో చర్చనీయాశంగా మారింది. ఈ దుష్ప్రచారం వెనుక ఎదేనా రాజకీయ కోణం ఉందా అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది.

Next Story