ఐస్ క్రీం నుంచి అల్లం వెల్లుల్లి వరకు అంతా కల్తీమయం..!

by Disha Web Desk 9 |
ఐస్ క్రీం నుంచి అల్లం వెల్లుల్లి వరకు అంతా కల్తీమయం..!
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో : ‘‘ రాష్ట్రంలో ఆహార పదార్థాల కల్తీకి పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అవసరమైతే చట్టంలో మార్పులు తీసుకు వద్దాం. ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదు. ఈ దందాకు నూటికి నూరుపాళ్లు చెక్​పెట్టటానికి అవసరమైన పకడ్బందీ చర్యలన్నీ తీసుకోవాలి..’’ అని 2017 జూలైలో ముఖ్యమంత్రి కేసీఆర్​అన్న మాటలివి. అప్పట్లో ఆ సమావేశంలో డీజీపీ మహేందర్​ రెడ్డి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇది జరిగి అయిదేళ్లు గడిచింది.

అయినా.. ఆహార పదార్థాల కల్తీదందాను అరికట్టేందుకు అవసరమైతే చట్టంలో మార్పులు తీసుకువద్దామని సీఎం కేసీఆర్​మాటలు నీటి మీద రాతలే అయ్యాయి. కొన్నాళ్లు హడావిడి చేసిన అధికారులు ఆ తర్వాత మామూలే అన్నట్టుగా వ్యవహరిస్తుండగా.. కల్తీ వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. గడిచిన రెండు నెలల్లోనే చిన్న పిల్లలు తినే చాక్లెట్ మొదలుకుని వంటింట్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్​వరకు కల్తీవి తయారు చేసే ముఠాలు పట్టుబడుతుండడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది.

ఏం తినేటట్టు లేదు..

పిల్లలకు చాక్లెట్లు.. ఐస్​క్రీం కొనిద్దామన్నా.. పాలు తాగించాలన్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి నెలకొని ఉంది. కాదేదీ కల్తీకనర్హం అన్నట్టుగా కొందరు అక్రమార్కులు డబ్బు సంపాదనే లక్ష్యంగా అన్నీ కల్తీమయం చేస్తున్నారు. ఆకర్షణీయంగా ప్యాక్​చేసి మార్కెట్లలోకి తెస్తున్నారు. రోడ్డు పక్కన ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లు, చిన్న హోటళ్లలో జంతు కళేబరాల కొవ్వు నుండి తీసిన నూనె తో చికెన్ ​చేసిన ఫుడ్‌ను అమ్ముతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కొన్ని నిదర్శనాలు..

చాక్లెట్లు, బిస్కెట్లు ఇలా ప్రతి దాన్ని రీసైక్లింగ్​చేసి తిరిగి ప్యాక్​చేసి రాష్ర్టవ్యాప్తంగా మార్కెటింగ్​చేస్తూ.. రాచకొండ ఎస్వోటీ పోలీసులకు ఏప్రిల్​14న పట్టుబడ్డ గ్యాంగ్​ఉదంతాన్ని పేర్కొనవచ్చు. కోఠిలోని హరిహంత్​సంస్థ హైదరాబాద్ వ్యాప్తంగా కిరాణా షాపుల నుంచి ఎక్స్పైరీ డేట్​దాటిన చాక్లెట్లు, బిస్కెట్లు, లాలీపాప్ లు తదితర వాటిని నామమాత్రపు ధరకు కొనుగోలు చేసి బోడుప్పల్​సమీపంలోని గోడౌన్​కు తరలించేది. అక్కడ వీటన్నింటినీ రీసైక్లింగ్​చేసి తిరిగి అవే కవర్లలో ప్యాక్​చేసి హైదరాబాద్​తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిందితులు విక్రయిస్తూ వచ్చారు. పక్కా సమాచారం అందటంతో ఎస్వోటీ పోలీసులు దాడి చేసి రూ. లక్షల విలువైన కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

కాటేదాన్​పారిశ్రామికవాడలో రెండేళ్లుగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న ఇద్దరిని ఎస్వోటీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దీంతోపాటు చిన్నపిల్లలు తాగే మ్యాంగో జ్యూస్‌కు కూడా ఈ గ్యాంగ్​లిటిల్​ఛాంప్స్​పేరుతో కల్తీ పౌడర్‌ను తయారు చేసి అమ్ముతుండటం గమనార్హం. భూదాన్​పోచంపల్లి మండలంలో నాణ్యత లేని పౌడర్‌తో పాలు తయారు చేసి అమ్ముతున్న వ్యక్తిని ఏప్రిల్ 24న రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి ముందు జనవరి 2న బీబీనగర్​గూడూరు చెక్​పోస్టు వద్ద కుమార్​యాదవ్‌ను అరెస్టు చేసిన కల్తీ పాలను సీజ్​ చేశారు. పాలు పగిలిపోకుండా ఉండడానికి నిందితుడు వాటిలో హైడ్రోజన్​పెరాక్సైడ్ రసాయనం కలిపి అమ్ముతున్నట్టు విచారణలో వెల్లడైంది.

ఐస్​క్రీంలు కూడా..

ఏప్రిల్​14న ఎస్వోటీ పోలీసులు చందానగర్​లోని ఓ ఐస్ క్రీమ్ తయారీ యూనిట్​పై దాడి చేశారు. తనిఖీల్లో నిందితుడు శ్రీనివాస్​రెడ్డి పదిమందిని ఉద్యోగులుగా పెట్టుకుని ఎక్స్​పైర్​అయిన సింథటిక్ ​కలర్స్, రసాయనాలు వాడి వెనిల్లా, చాక్లెట్, బటర్​స్కాచ్ ​ఇలా అన్ని రకాల ఐస్​ క్రీంలు తయారు చేసి మార్కెట్లో సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. రాచకొండ ఎస్వోటీలోని ఓ అధికారితో మాట్లాడగా పట్టుబడ్డ కల్తీ ముఠాలు కొన్నేనని చెప్పారు. హైదరాబాద్ తో పాటు శివార్లలో ఇలాంటి దందా జరుపుతున్న వారి సంఖ్య పదుల్లో ఉంటుందన్నారు. చట్టంలో కఠిన శిక్షలు లేకపోవటంతో అరెస్టవుతున్నా బెయిల్​తీసుకుని బయటకు వస్తున్న నిందితులు అడ్డాలు మారుస్తూ ఈ దందా కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

కల్తీలతోనే రోగాలు

కల్తీ ఆహార పదార్థాలను తింటుండటం వల్ల రోగాలు పెరుగుతున్నట్టు సీనియర్​ డాక్టర్ ​విజయ్ ​కుమార్​ తెలిపారు. పాతికేళ్లు నిండక ముందే బ్లడ్​ప్రెషర్, అజీర్తి, ఎసిడిటీ లాంటి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం దీనిని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. కల్తీ ఆహార పదార్థాలతో క్యాన్సర్ ​వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా సోకుతాయని చెప్పారు. వీలైనంత వరకు బయట ఫుడ్​ తినకపోవడమే మేలని సూచించారు.


Next Story