ఈడీ ముందుకు తెలంగాణ మాజీ మంత్రి!

by Disha Web Desk 2 |
ఈడీ ముందుకు తెలంగాణ మాజీ మంత్రి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించిన దర్యాప్తు సంస్థ తాజాగా తెలంగాణ నేతలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. టీ-కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేసిన ఈడీ కూపీలాగే ప్రయత్నం చేస్తోంది. కేసులో భాగంగా యంగ్ ఇండియా లిమిటెడ్‌కు వచ్చిన విరాళాల విషయంపై అధికారులు విచారిస్తున్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, గీతారెడ్డి, ఆ పార్టీ నేత గాలి అనిల్ కుమార్‌లను ఈడీ అధికారులు ఇప్పటికే ఓ దఫా ప్రశ్నించగా తాజాగా సోమవారం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. అయితే, ఈ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. గత వారమే ఆయన ఈడీ ముందుకు వెళ్లాల్సి ఉన్నా అనారోగ్య కారణాల చేత విచారణకు హాజరు కాలేనని ఆయన చెప్పినట్లు తెలిసింది. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పలుసార్లు ప్రశ్నించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలను సైతం ఆరా తీసింది. తాజాగా తెలంగాణ నేతలపై దృష్టి సారించడంపై ఆ పార్టీ నేతల నుండి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర త్వరలో తెలంగాణలో ప్రవేశించబోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి చెందిన నేతలను విచారణకు పిలవడం హస్తం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story