ప్రారంభమైన ఎంసెట్.. తొలిరోజు అగ్రికల్చర్, ఫార్మసీ ఎగ్జామ్స్

by Disha Web Desk 12 |
ప్రారంభమైన ఎంసెట్.. తొలిరోజు అగ్రికల్చర్, ఫార్మసీ ఎగ్జామ్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మెడికల్, ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఎంసెట్ పరీక్ష ప్రారంభమైంది. బుధ, గురువారాల్లో మెడికల్, అగ్రికల్చర్ విభాగానికి చెందిన విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా ఈ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జామ్స్ నేటి నుంచి మొదలుకొని ఈనెల 14వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు ఇంజనీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ ఏడాది ఎంసెట్ కు 3.20,587 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ఎంసెట్ కు 53,873 మంది అప్లికేషన్లు అదనంగా వచ్చాయి. విద్యార్థుల సంఖ్యనుగుణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 137 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. గతం కంటే అదనంగా 28 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో 104 సెంటర్లు, ఆంధ్రప్రదేశ్ లో 34 కేంద్రాల్లో ఎగ్జామ్ కొనసాగనుంది.

ఎంసెట్ రాసే విద్యార్థులను ఉదయం 7 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. కాగా మధ్యాహ్నం సెషన్‌కు అభ్యర్థులకు 1:30 గంటల నుంచి అనుమతిస్తారు. ఎంసెట్ కు నిమిషం నిబంధన ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ముందుగానే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత విద్యార్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతించలేదు. దీంతో పలువురు ఎగ్జామ్ కు దూరం కావాల్సి వచ్చింది.

అభ్యర్థులు తమ వెంట హాల్‌టికెట్, ఆన్‌లైన్ దరఖాస్తు ఫామ్, కుల ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. ఎగ్జామినేషన్ హాల్ లోపల చెక్ ఇన్ విధానంలో బయోమెట్రిక్ తీసుకుంటారని తెలిపారు. అభ్యర్థులు తమ చేతులపై మెహందీ, టాటూలు లాంటివి ఉండకూడదని, బయోమెట్రిక్ ప్రయోజనం కోసం వారి చేతులను శుభ్రంగా, నీట్‌గా ఉంచుకోవాలని సూచించారు. ఇతర ఎలాంటి వస్తువులు అభ్యర్థులు తమ వెంట తీసుకు రాకూడదు స్పష్టంచేశారు.


Next Story