బైంసాలో నేడు ‘డబుల్ ఇండ్ల’ డ్రా కార్యక్రమం.. స్థలాలిచ్చిన ప్రజల్లో ఉత్కంఠ!

by Disha Web Desk 2 |
బైంసాలో నేడు ‘డబుల్ ఇండ్ల’ డ్రా కార్యక్రమం.. స్థలాలిచ్చిన ప్రజల్లో ఉత్కంఠ!
X

దిశ, బైంసా: బైంసా పట్టణంలోని 26 వార్డుల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దాదాపు 8000 పై చిలుకు దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దాదాపు 640 డబుల్ బెడ్రూమ్స్‌ను నిర్మించగా, దీంట్లో గుండెగాం ముంపు గ్రామ ప్రజల కోసం దాదాపు 200 ఇండ్లు తాత్కాలిక నివాసంగా ఏర్పాటు చేశారు. మిగతా 440 ఇండ్లకు నేడు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఎంపిక విధానంపై ఇంకా సరైన స్పష్టత లేక ప్రజలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులకు డ్రా నిర్వహించగా.. డ్రాలో పేరు రాని ప్రజలు డబుల్ ఇళ్లు రాకపోయినా స్థలం ఉన్నా వారికి ఇంటినిర్మాణం నిమిత్తం అందించే రూ.3 లక్షల స్కీమ్‌లో అయినా అర్హులుగా ఉంటామా..! లేదా..! అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంద్రమ్మ ఇండ్లస్థలాలు ఇచ్చిన వారి పరిస్థితి ఏంటి..?

గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోఉన్నప్పుడు పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పేరిట స్థలాలు మంజూరు చేసింది. నిర్మాణాల కోసం ప్రత్యేక అకౌంట్లలలో విడుతల వారీగా నగదు కూడా జమచేసింది. అయితే పట్టణానికి చెందిన బోర్ర గణేష్ ఇంటి సమీపంలో ఇందిరమ్మ ఇండ్లకి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థలాన్ని మంజూరు చేయగా, దాదాపు వందకుపైగా మంది ఇందిరమ్మ ఇండ్ల స్థలాలలో బేస్మెంట్ వరికు నిర్మాణాలు నిర్మించి, మళ్లీ నిధులు రాకపోవడంతో వేచి ఉంచారు. కాలక్రమేణ ప్రభుత్వాల మారుతూ ఉండడంతో ఇంద్రమ్మ ఇంటి నిర్మాణాలు కాస్త అలానే కుంటుపడిపోయాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలకు పట్టణ సరిహద్దులలో ప్రభుత్వ స్థలాలను వెతకగా ఎక్కడ అనువైన స్థలం దొరకలేదు. దీంతో గతంలో బైంసాపట్టణం బోర్ర గణేష్ సమీపాన ఇంద్రమ్మ ఇండ్లకు కేటాయించిన స్థలాలలోనే నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు.

వారు కట్టుకున్న బేస్మెంట్ లెవెల్, గోడల లెవల్ ఇండ్లను చెరిపేసే పరిస్థితి వచ్చింది. ఇంద్రమ్మ ఇండ్ల స్థలాల లబ్ధిదారులు, ఇంద్రమ్మ స్థలాలలో ఇంటి నిర్మాణం కోసం బేస్మెంట్, గోడల వరకు నిర్మాణాలు చేపట్టిన ప్రజలు, ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ నిర్మించనివ్వబోమంటూ తొలుత ఆందోళన చేపట్టారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే, అధికారులు కలిగించుకొని డబుల్ బెడ్రూమ్స్‌కి అనువైన స్థలం ఇదేనని ఇందిరమ్మ ఇండ్లస్థలాల్లో ఇళ్ల నిర్మాణంచేపట్టనివ్వాలంటూ స్థల ప్రజలను కోరారు. ఇక్కడ ఇండ్ల స్థలాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడే డబుల్ బెడ్రూమ్స్ అందేలా కృషి చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ఎలాగూ డబుల్ బెడ్రూమ్ వస్తుందని ఇందిరమ్మ ఇండ్ల స్థల ప్రజలు అంగీకారం తెలిపారు. ఎమ్మెల్యే వెంటనే అధికార సిబ్బందికి చెప్పగా.. ఇంద్రమ్మ ఇళ్లస్థలాలు ఉన్నవారి వివరాలను, వారి వారి స్థలాలలోని నిర్మాణాల ముందు లబ్ధి దారులుదిగిన ఫోటోలతో సహా అధికారులు నమోదు చేసుకున్నారు. నేడు డ్రా అనేసరికి మాకు డబుల్ బెడ్రూమ్స్‌లో చోటు ఉందా..? లేదా..? లేకపోతే మా స్థలం ఇచ్చిన వాటిపైనే నిర్మించిన ఇండ్లలో మమ్మల్ని పక్కకు నెట్టడం ఎంతవరకు సమంజసం అని స్థల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. డబుల్ బెడ్రూమ్స్ తమకి ఇవ్వాలని ఇటీవల శాసనసభ్యుని సైతం విన్నవించారు.

అధికారులు సరైన వారినే ఎంపిక చేశారా..?

డబుల్ బెడ్రూమ్స్ అర్హులను గుర్తించే పనిలో అధికారులు విఫలమైనట్లు ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎన్నిసార్లు గ్రామసభలు నిర్వహించినా తూతూ మంత్రంగానే చర్యలు జరిగాయని.. సరైన అర్హులను పక్కన పెట్టారని ఇల్లు, ప్లాటు, వాహన బండ్లు, వ్యవసాయ భూములు కలిగిన పలువురుని లిస్టులలో జోడించారని.. నిలువ నీడలేని ప్రజలను పక్కనపెట్టి ఇలా అనర్హులకు లిస్టులో చోటు ఇవ్వడంపై ఆవేదన చెందుతున్నారు. గతంలో అధికారులు గుర్తించే పని నిమిత్తం కిసాన్ గల్లీలో పర్యటించగా ప్రజలు అధికారులతో వాదనకు దిగారు. ఏదేమైనా నేడు జరిగే డ్రాలో ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఉంటాయని ప్రజలంటున్నారు.

Next Story

Most Viewed