భూ విజ్ఞానంలో తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతి.. డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్శిటీ

by Muthe.Rajitha |

రాష్ట్రంలో భూ విజ్ఞాన శాస్త్రాల అధ్యయనాన్ని, పరిశోధనను ప్రోత్సహించడానికి , అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి కొత్తగూడెంలో ఏర్పాటైన డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం పై తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి ఆయా అంశాలతో కూడిన రిపోర్టును సీఎంకు అందజేశారు.

భూ విజ్ఞానంలో తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతి.. డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్శిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూ విజ్ఞాన శాస్త్రాల అధ్యయనాన్ని, పరిశోధనను ప్రోత్సహించడానికి , అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి కొత్తగూడెం లో ఏర్పాటైన డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం పై తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి ఆయా అంశాలతో కూడిన రిపోర్టును సీఎంకు అందజేశారు. అందులో ప్రధానంగా ఈ యూనివర్శిటీ స్థాపనతో రాబోయే ఐదేళ్లలో 2,000 మందికి పైగా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, పరిశోధక పండితులు భూ విజ్ఞాన శాస్త్ర రంగాలలో నైపుణ్యం సాధిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. గోదావరి నదికి సమీపంలో, సింగరేణి కాలరీస్ బొగ్గు ప్రాంతంలో వ్యూహాత్మకంగా నెలకొల్పబడిన ఈ యూనివర్శిటీ బొగ్గు, నీటి వనరుల నిర్వహణ, విపత్తుల నివారణ, సుస్థిరత వంటి ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించడానికి అనుకూలంగా ఉంటుంది. తొలి ఐదేళ్లు విద్యా కార్యక్రమాలు బీఎస్సీ జియాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జియోఇన్ఫర్మేటిక్స్, బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్ కోల్ జియాలజీ, రివర్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్. డిప్లొమా/పీజీ డిప్లొమా మైన్ సేఫ్టీ, రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ కోర్సులు ప్రవేశ పెట్టనున్నారు. ఈ యూనివర్శిటీలో పరిశోధన రంగాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వాతావరణ మార్పు, అనుకూలత, జల వనరులు, సుస్థిర మైనింగ్, విపత్తుల తగ్గింపు, జియో హెల్త్ వంటి రంగాలలో పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ యూనివర్శిటీ ఈటీహెచ్ జూరిచ్ (స్విట్జర్లాండ్), ఎంఐటీ (యూఎస్),కేంబ్రిడ్జ్/డర్హామ్ విశ్వవిద్యాలయాల (యూకే) ఉత్తమ పద్ధతులను అనుసరించనుంది.

జియో ఏఐ కోర్ కరిక్యులమ్:

ఎంఐటీ నమూనా ప్రకారం, విద్యార్థులందరూ కంప్యూటేషనల్ జియోసైన్స్, జియో ఇన్ఫర్మేటిక్స్‌లో కోర్ మాడ్యూల్స్ తీసుకోవడం తప్పనిసరి. సింగరేణి కాలరీస్, ఎన్ఎండిసి, ఓఎన్ జీసీ, ప్రభుత్వ సంస్థలైన ఇస్రో, ఎన్ ఆర్ ఎస్ సీలతో పారిశ్రామిక, ప్రభుత్వ సహకారాన్ని పెంచనున్నారు.

ఉద్యోగుల నియామకం:

ప్రారంభ దశలో 64 మంది అంకితభావంగల బోధనా సిబ్బందిని (ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు) నియమించాలని ప్రతిపాదించారు. సిలబస్‌ను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రూపొందించడానికి, ఎన్ జీఆర్ఐ, జీఎస్ ఐ, సింగరేణి కాలరీస్ వంటి సంస్థల నుంచి కనీసం 5 మంది 'ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్'ను నియమించాలని ప్రతిపాదన ఉంది.

ఆర్థిక కేటాయింపులు (2025-2026):

ప్రారంభ సంవత్సరంలో మొత్తం రూ1,306.756 లక్షలు బడ్జెట్‌గా కేటాయించనున్నారు. ఇందులో ప్రయోగశాలల కోసం రూ.195.793 లక్షలు, సివిల్ పనుల కోసం రూ.1,110.963 లక్షలు ఉన్నాయి. నిధుల వనరులలో భాగంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, పరిశ్రమ భాగస్వామ్యాలు (సీఎస్ ఆర్), విద్యార్థుల ఫీజులు, అంతర్జాతీయ గ్రాంట్లు, దాతృత్వం నుండి నిధులను సేకరించాలని ప్రతిపాదించారు.

Next Story