58 యుద్ధాలు ఆపాలి.. అమెరికా సెనేట్‌లో కేఏ పాల్ అరుదైన ప్రసంగం

by Ramesh Naini |

ప్రపంచంలో కొనసాగుతున్న యుద్ధాలు వెంటనే ఆగాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా. కేఏ పాల్ పిలుపునిచ్చారు.

58 యుద్ధాలు ఆపాలి.. అమెరికా సెనేట్‌లో కేఏ పాల్ అరుదైన ప్రసంగం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలో కొనసాగుతున్న యుద్ధాలు వెంటనే ఆగాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా. కేఏ పాల్ పిలుపునిచ్చారు. అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్ (అసెంబ్లీ) సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 58 ప్రధాన యుద్ధాల వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, ట్రిలియన్ల డాలర్లు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాల నిర్మూలనతోనే శాశ్వత శాంతి సాధ్యమని పేర్కొంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని, ప్రపంచ శాంతి, సమృద్ధి కోసం ఇరు దేశాలు కలిసి నాయకత్వం వహించాలని డా. పాల్ సూచించారు. ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కుల పరిరక్షణలో భారత్, అమెరికా కీలక పాత్ర పోషించగలవని ఆయన అభిప్రాయపడ్డారు.

కేఏ పాల్‌కు లభించిన గౌరవం

కాగా, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మత ప్రచారకుడిగా డా. కేఏ పాల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. అమెరికాలో గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ (GPI), గాస్పెల్ టు ది అన్‌రీచ్డ్ మిలియన్స్ (GUM) వంటి సంస్థలను స్థాపించి, అనాథాశ్రమాలు, స్వచ్ఛంద సంస్థల నిర్వహణతో పాటు మానవతావాదిగా సేవలందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా, ప్రజా సమస్యలపై ఉన్నత న్యాయస్థానాల్లో పోరాడే వ్యక్తిగా విభిన్న పాత్రలతో సుపరిచితులు. అలాగే ఆయన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అమెరికా సెనేట్‌లో డా. కేఏ పాల్‌కు లభించిన గౌరవం తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనపై ఆసక్తి, గౌరవాన్ని మరింత పెంచిందని నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అమెరికా సెనేట్‌లో ప్రసంగించిన వీడియోను ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

Next Story