సిటీలో త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు

by Disha Web Desk 4 |
సిటీలో త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సిటీలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రయాణీకులకు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ తెలిపారు. ప్ర‌యాణికుల అవ‌స‌రాల మేర‌కు బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని పేర్కొన్నారు. డబుల్ డెక్కర్ బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ దగ్గర బడ్జెట్ లేదని, మంత్రి కేటీఆర్ స్పందించి నిధులు ఇస్తారని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. శనివారం శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ, ఇత‌ర జిల్లాల్లో ఆర్టీసీ బ‌స్సుల సౌక‌ర్యంపై స‌భ్యులు మహ్మద్ మోజాంఖాన్, ముంతాజ్ అహ్మద్ ఖాన్, సీతక్క అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్సు డిపోలు ఉన్నాయని, ఏ ఒక్క బస్సు డిపోను ఎత్తేయలేదని వెల్లడించారు. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా 9,800 బ‌స్సులు తిరిగితే.. 2022లో 9,057 బ‌స్సులు తిరుగుతున్నాయ‌ని తెలిపారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో నాడు 3,554 బ‌స్సులు అందుబాటులో ఉంటే ప్ర‌స్తుతం 2,865 బ‌స్సులు న‌డుపుతున్నామ‌ని, గ్రేటర్ లో మినీ బ‌స్సులు న‌డిపేందుకు ప‌రిశీల‌న చేస్తామ‌న్నారు. డీజిల్ ధ‌ర‌లు భారీగా పెరిగినందునే మినీ బ‌స్సుల‌ను న‌డ‌ప‌ట్లేద‌ని స్ప‌ష్టం చేశారు. మినీ బ‌స్సుల్లో ప్యాసింజ‌ర్ కెపాసిటీ కూడా త‌క్కువ‌గా ఉంద‌న్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌యాణికుల‌కు వీలుగా ఉండేందుకు పెద్ద బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని తెలిపారు. ములుగు కొత్త జిల్లా అయినందున అక్క‌డ బ‌స్ డిపో, బ‌స్టాండ్ ఏర్పాటుకు ప‌రిశీల‌న చేస్తున్నామ‌ని, కరోనాతో తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయిందని, ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటపడుతుందన్నారు. మేడారం జాత‌ర‌లో రూ. 11 కోట్లు మాత్ర‌మే ఆదాయం వ‌చ్చిందని, 2763 బ‌స్సుల్లో 11 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికుల‌ను త‌రలించామ‌ని పేర్కొన్నారు. కార్మికులకు ఫిట్ మెంట్ కూడా త్వరలోనే ఇస్తామని వెల్లడించారు.

Next Story