డిగ్రీ ప్రవేశాలకు ‘దోస్త్-2026’ నోటిఫికేషన్ విడుదల.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-13 07:40:06  IST  )

ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదలైంది.

డిగ్రీ ప్రవేశాలకు ‘దోస్త్-2026’ నోటిఫికేషన్ విడుదల.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) శుభవార్త చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST-2026) అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది. ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు మొదటి ఫేజ్రి జిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దోస్త్ ద్వారా B.A., B.Com, B.Sc., BBA, BCA, BBM, BSW, D-Pharmacy వంటి వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఓస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాలతో పాటు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ, JNTU మరియు TS-SBTET పరిధిలోని కళాశాలల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే విధానం..

విద్యార్థులు తమ దరఖాస్తులు సమర్పించేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అభ్యర్థులు ముందుగా తమ వివరాలతో ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకుని ‘దోస్త్ ఐడీ’ (DOST ID) పొందాల్సి ఉంటుంది. రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన తర్వాత విద్యార్థులకు ఒక ‘పిన్’ నంబర్ అందుతుంది. అడ్మిషన్ ప్రక్రియ ముగిసే వరకు ఈ పిన్‌ను భద్రపరుచుకోవాలి. దోస్త్ ఐడీ, పిన్ ఉపయోగించి లాగిన్ అయి, తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి ఆధార్ నంబర్ మొబైల్ నంబర్‌తో అనుసంధానమై ఉంటే, మొబైల్ OTP ద్వారా నేరుగా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తేదీలు, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Next Story