పేపర్ లీక్ పై చదువురాని, బాధ్యత లేని వారిగా మాట్లాడొద్దు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 12 |
పేపర్ లీక్ పై చదువురాని, బాధ్యత లేని వారిగా మాట్లాడొద్దు: పల్లా రాజేశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేపర్ లీక్ పై టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యక్తిగతంగా మాట్లాడొద్దని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి సూచించారు. పేపర్ లీక్ ఘటనపై రాజకీయ పాలసీతో మాట్లాడొద్దని హితవు పలికారు. సోమవారం బిఆర్ఎస్ఎల్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువు రాని ప్రతిపక్ష నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు.

చదువుకున్న బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ వారి లాగే మాట్లాడటం దురదృష్టకరం అన్నారు. ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శి గా ఉన్నపుడు మా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, సీఎం గాని ఉద్యోగాల కోసం రికమెండ్ చేశారా చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం నిజాయితీ గల టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డిని విమర్శించడం ప్రవీణ్‌కు తగదు..ఏవైనా సలహాలుంటే ఇవ్వాలి.. బురద చల్లకూడదు అని సూచించారు.

సీట్ పై నమ్మకం లేదని ప్రతిపక్షాలు మాట్లాడడంలో అర్థం లేదన్నారు. సిటీపై రాష్ట్ర పోలీసు వ్యవస్థ పై నమ్మకం ఉందని.. కేంద్ర సంస్థలు సైతం మన పోలీసులను కేసుల విచారణ సమయంలో సాయం తీసుకుంటున్నారన్నారు. సిట్ విచారణను కించపరిచేలా ఎవరు మాట్లాడినా సరికాదని, సిట్ విచారణ తో నిజాలు బయటకు వస్తాయన్నారు. గత మూడు రోజులుగా రాష్ట్రం లో అకాల వర్షాలు కురుస్తున్నాయని అన్నారు.

అకాల వర్షాలతో పంట నష్ట పోవడం దురదృష్టకరం అని జరిగిన పంట నష్టాన్ని సీఎం ఆదేశాల మేరకు అధికారులు పరిశీలన చేస్తున్నారన్నారు. 80 వేల మంది రైతులకు సంబంధించి లక్షా 50 వేల ఎకరాల పంట నష్టం జరిగిందని జిల్లా కలెక్టర్లు ఆదివారం వరకు ప్రాథమిక నివేదికలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో 2603 వ్యవసాయ క్లస్టర్లు రాష్ట్రం లో ఉన్నాయని, క్లస్టర్ల వారీగా నివేదికలు రూపొందిస్తున్నారని తెలిపారు.

తుది నివేదికలు వచ్చాక ప్రభుత్వం రైతులకు భరోసా ఇచ్చి ఆదుకునే చర్యలు చేపడుతుందన్నారు.కేంద్ర ప్రభుత్వం కూడా పంట నష్టాలను పరిశీలించేందుకు బృందాలు పంపాలని..గతం లో ఏడు వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగితే 250 కోట్ల రూపాయలు సాయం చేసి కేంద్రం చేతులు దులుపుకుందని ఆరోపించారు. కేంద్రానికి తెలంగాణ ప్రజలంటే కోపం..అందుకే సరిగా స్పందించడం లేదని తెలంగాణ ప్రజలు బీ ఆర్ ఎస్ కు అండగా ఉన్నారు కనుకే బీజేపీ ప్రభుత్వం కక్ష గట్టిందని ఆరోపించారు.

కేంద్ర ఫసల్ బీమా పథకం లోప భూయిష్టంగా ఉందని .. అది బీమా కంపెనీలకు ఉపయోగపడేలా ఉంది తప్ప రైతులకు ఉపయోగంగా లేదన్నారు. తక్షణమే కేంద్రం కొత్త పథకం తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిరుద్యోగులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ వచ్చాక ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు.

ఇద్దరు ఇంటి దొంగల వల్ల tspsc పేపర్లు లీక్ అయ్యాయని, మొత్తం వ్యవస్థనే అవమానపరిచేలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.జంబ్లింగ్ విధానం లో పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాలు రూపొందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, నిరుద్యోగులు మనో స్థైర్యాన్ని కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కె. పి. వివేకానంద మాట్లాడుతూ పేపర్ లీకేజీ ఘటన పై ప్రతిపక్షాల తీరు సరిగా లేదని మండిపడ్డారు. బండి సంజయ్ ktrకు వస్తున్న జాతీయ అంతర్జాతీయ గుర్తింపును ఓర్చుకోలేక పిచ్చి విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సిరిసిల్ల లో నవీన్ అనే యువకుడు ఆత్మహత్య వేరే కారణాలతో చేసుకుంటే బీజేపీ నేత వివేక్ వెంకట స్వామి దుష్ప్రచారం చేశారని స్వయంగా నవీన్ తండ్రి తన కుమారుడి మృతిని రాజకీయం చేయవద్దని వేడుకున్నారని, నవీన్ మృతి పై అబద్ధాలు ప్రచారం చేసిన నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు దుష్ప్రచారం మానక పోతే లీగల్ నోటీసులు ఇస్తాం అని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యే లు గండ్ర వెంకట రమణారెడ్డి, సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు.

Also Read..

బిగ్ బ్రేకింగ్: TSPSC పేపర్ల లీకేజీ కేసులో రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు


Next Story

Most Viewed