గద్వాల ఎమ్మెల్యేగా గుర్తించండి.. అసెంబ్లీ కార్యదర్శితో డీకే అరుణ భేటీ

by Disha Web Desk 19 |
గద్వాల ఎమ్మెల్యేగా గుర్తించండి.. అసెంబ్లీ కార్యదర్శితో డీకే అరుణ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తనను గద్వాల ఎమ్మెల్యేగా గుర్తించాలని, తన ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు చేయాలని ఇవాళ అసెంబ్లీ కార్యదర్శితో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ భేటీ అయ్యారు. డీకే అరుణను ఎమ్మేల్యేగా గుర్తిస్తూ గెజిట్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు ఆర్డర్ కాపీని, కేంద్ర ఎన్నికల సంఘం ఆర్డర్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి ఆమె అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గద్వాలలో 2018లో గెలిచిన అభ్యర్థి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై తాను కోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. తన పిటిషన్‌పై విచారణ జరిపి తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోర్టు ఆదేశం ఇవ్వడం జరిగిందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించిందని తెలిపారు.

ఈ కాపీలను స్పీకర్ కార్యాలయంతో పాటు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి వారికి తన ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. తీర్పు నేపథ్యంలో త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంపై స్పీకర్ సానుకూలంగా స్పందిస్తారని ఆశించారు. కృష్ణ మోహన్ రెడ్డి పిటిషన్‌పై తమ న్యాయ వాదులు స్పందిస్తారని చెప్పారు. ఆయన హై కోర్టును నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ తీర్పు వెలువరిచిందని అన్నారు. ఆయన నెల రోజులు ముందే మీడియా ద్వారా తెలిసిన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 2019లో తను కోర్టును ఆశ్రయించారని, తనను తాను సమర్ధించడం కోసం ఆయన హైకోర్టు ను విమర్శించడం సరైంది కాదని హితవు పలికారు.

Next Story