Disha effect: దిశ కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందన.. సెటిల్మెంట్ ఆఫీసర్ పై చర్యలకు ఆదేశాలు

by Prasad Jukanti |   (  Updated:2025-06-30 10:50:23  IST  )

సెక్రటేరియల్ లో సెటిల్ మెంట్లు పేరుతో దిశ దినపత్రిక వెలువరించిన కథనానికి ప్రభుత్వం స్పందించింది.

Disha effect: దిశ కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందన.. సెటిల్మెంట్ ఆఫీసర్ పై చర్యలకు ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : 'దిశ' దినపత్రిక కథనానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) స్పందించింది. 'సెక్రటేరియట్‌లో సెటిల్‌మెంట్లు!' (SECRETARIAT LO SETTLEMENTLU) శీర్షికతో పంచాయతీరాజ్ శాఖలోని ఓ అసిస్టెంట్ సెక్రెటరీ స్థాయి ఆఫీసర్ దందాపై ఇవాళ 'దిశ' దినపత్రిక కథనాన్ని ప్రచురించగా ఈ వార్తపై సర్కార్ రియాక్ట్ అయింది. ఈ వ్యవహారంపై పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి ఏవిఎన్ రమేశ్ కుమార్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ సీఎస్ ఎన్. శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ రాజ్ ‌అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వ సహాయ కార్యదర్శి జి. శ్రీనివాసులుపై వస్తున్న ఆరోపణలపై 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రభుత్వ ఆదేశాల్లో ‘దిశ’ పేరు ప్రస్తావన :

'దిశ' (Disha) దినపత్రిక కథనంపై స్పందిస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల్లో 'దిశ' దినపత్రిక పేరును ప్రస్తావించింది. పంచాయతీ రాజ్ శాఖలో ఓ అసిస్టెంట్ సెక్రటరీ స్థాయి ఆఫీసర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్‌పర్స్, ప్రమోషన్ల కోసం ఉద్యోగుల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారని 'దిశ' పత్రిక తన కథనంలో పేర్కొందని ఫైళ్లు ముందుుకు కదలాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందేనని, సాయంత్రం ఐదు తర్వాత సెక్రటేరియట్‌లోనే ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నట్లు 'దిశ' వార్త సారాంశాన్ని సర్కార్ తన ఆదేశాలలో ప్రస్తావించింది. సదరు ఉద్యోగి జి.శ్రీనివాసులు తాను నిర్వహిస్తున్న ఎంపీడీవో, డీపీవో, డిప్యూటీ సీఈవో, సీఈవోల సర్వీసులను తక్షణం జీఏడీకి అప్పగించాలని నిర్ణయించినట్లు ఎన్.శ్రీధర్ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Next Story