విద్యార్థులకు డైట్ ఛార్జీలు 50 శాతం పెంచాలి: MP ఆర్ కృష్ణయ్య డిమాండ్

by Disha Web Desk 19 |
విద్యార్థులకు డైట్ ఛార్జీలు 50 శాతం పెంచాలి: MP ఆర్ కృష్ణయ్య డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో సంక్షేమ శాఖ పరిధిలోని గురుకులాలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు డైట్ ఛార్జీలు 25 శాతం పెంపు ప్రతిపాదన సరికాదని.. ఇది ఏమాత్రం సరిపోదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. పోరాటాల ఫలితంగానే సర్కార్ స్పందించిందన్న ఆయన.. మంత్రులు ప్రతిపాదించిన 25 శాతం సరిపోదని ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని 50 శాతానికి పెంచాలన్నారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మంత్రులు చేసిన ప్రతిపాదనలకు ఎలాంటి శాస్త్రీయత, హేతుబద్ధత లేదన్నారు.

కేవలం ఊహాజనితంగా డైట్ ఛార్జీలు పెంచుతూ ప్రతిపాదన చేశారన్నారు. గతంలో ఉపసంఘం చెప్పిన ప్రతిపాదనలకంటే సీఎం అధికంగా పెంచారని ఈ సారి కూడా మెస్ ఛార్జీలు 50 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. 25 శాతమే పెంచుతామని ఇదే గొప్ప అన్నట్లుగా చెప్పడం సరికాదని.. 3-7 తరగతుల విద్యార్థులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.950 నుంచి రూ.1500 లకు పెంచాలన్నారు. 8-10 తరగతి విద్యార్థులకు రూ.1,100 నుంచి రూ.2000 లకు, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు రూ.1500 నుంచి 3 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed