T Congress: వాటి ఆధారంగానే బీఫాంలు.. మున్సిపల్ టికెట్లపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-01-12 06:56:34  IST  )

బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు.

T Congress: వాటి ఆధారంగానే బీఫాంలు.. మున్సిపల్ టికెట్లపై  టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత నెలలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నామని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. సర్వేల ఆధారంగా మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసి బీఫాంలు (B-Forms) ఇస్తామన్నారు. ఇవాళ నిజామాబాద్‍లో మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. మున్సిపల్ ఎన్నికల్లో 70 శాతం సీట్లు కాంగ్రెస్ గెలుచుకోబోతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఓట్ల రూపంలో మారనుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

రాముడు బీజేపీ సభ్యత్వం తీసుకున్నారా?:

వేల ఉద్యోగాలను తొలగించిన ఘనత ప్రధాని మోడీదని, బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలో ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. దేవుడి పేరు మీద ఓట్లు అడిగే హక్కు బీజేపీకి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. పేదలకు బీజేపీ ఏం చేసిందో ప్రజలు ఆత్మపరిశీలన చేయాలన్నారు. ప్రతి రోజు కులం, మతం ఆధారంగా రాజకీయాలు చేస్తోంది. మేము కూడా పూజ చేయకుండా ఇంట్లో నుంచి బయటకు రాను. కానీ దేవుడి పేరు మీద ఓట్లు అడిగే సంస్కృతి కాంగ్రెస్‍కు లేదు. శ్రీరాముడు బీజేపీ సభ్యత్వం తీసుకున్నారా? రాముడిని వాడుకునే హక్కు బీజేపికి ఎవరిచ్చారని నిలదీశారు. ఎవరు ఎవరికి సొత్తు కాదు. దేవుళ్లు సామాన్యుల సొత్తు అన్నారు. ఎన్నికలు రాగానే హిందూ, ముస్లిం వివాదం తీసుకువస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతమైన వాతావరణం చెడగొడుతున్నారు. ఇది ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. దేవుళ్ల పేరుతో బీజేపీ ఓట్లు దండుకోవాలని చూడటం సమాజానికి మంచిది కాదన్నారు. మేమంతా పరిపూర్ణమైన హిందువులమన్నారు.

ఎన్నికల వరకే రాజకీయాలు:

ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం కావాలని ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఏ పార్టీ శాసనసభ్యులు వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పంపిణీ జరుగుతోందని, రెండో దఫాలో కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాకు మరో రెండు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తామన్నారు. సరైన సమయంలో ఫోర్త్ సిటీ నిర్మాణం అవుతుందని రాష్ట్రంలో అభివృద్ధి డీసెంట్రలైజ్ కావాలని సీఎంను కోరారమని అందుకు ముఖ్యంత్రి అంగీకరించారన్నారు. నిజామాబాద్‍లో మంచి మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్ ఈ నిజామాబాద్ కోసం ఏం తీసుకువచ్చారని ప్రశ్నించారు. పసుపు బోర్డు తెచ్చి అటకెక్కించారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల అంశం అటకెక్కలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 80 వేల ఉద్యోగాలు ఇచ్చిందని 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామన్నారు. రాబోయే మూడేళ్లలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని ఇది నిరుద్యోగులకు మేము ఇస్తున్న హామీ అన్నారు.

Next Story