మూసీ ప్రక్షాళనపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
మూసీ ప్రక్షాళనపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ అభివృద్దికి వెన్నుముక లాంటి హెచ్ఎండీఏలో ప్రత్యామ్నాయ వనరులను సృష్టించి, హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జీహెచ్ఎంసీ‌లో భాగమైన మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. కొత్త బడ్జెట్‌కు ప్రతిపాదనలు తయారు చేయాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు.

గురువారం డా. బిఆర్ అంబేద్కర్ స‌చివాల‌యంలోని డిప్యూటీ సీఎం తన ఛాంబర్ లో నూతన ఆర్థిక సంవత్సరం (2024-25) వార్షిక బ‌డ్జెట్‌కు సంబందించి రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ రూపొందించిన ప్రతిపాదనలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ హైద‌రాబాద్ మ‌హ‌న‌గరానికి సంబంధించి నాలుగు అంశాల‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తుందని వెల్లడించారు.

హైద‌రాబాద్ ఖ్యాతిని పెంచ‌డం, డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దంటం, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ది చేయ‌డం, మూసీని ప్రక్షాళన చేసి హైద‌రాబాద్ షాన్‌ను మరింత పెంచటమే లక్ష్యంగా సర్కారు ముందుకెళ్తుందని వివరించారు. హైద‌రాబాద్‌లో డ్రగ్స్ నియంత్రణకు క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌కు ఆదేశించారు. డ్రగ్స్ దొరికిన చోట క‌ఠినమైన‌ కేసులు న‌మోదు చేయ‌డంతో పాటు వాటికి అన్ని ర‌కాల అనుమ‌తులు ర‌ద్దు చేసి సౌక‌ర్యాలను నిలిపివేయాల‌ని ఆదేశించారు.

గ్రీన్ అండ్ క్లీన్ సిటిగా మార్చటానికి మురుగు నీటి కాలువ‌ల‌ను నిర్మించేందుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు వివరించారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్న చెరువుల సంరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పచ్చదనాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులు ఆక్రమణకు గురైన చోట వాటి పరిరక్షణ విషయంలో స్థానిక ప్రజల సహకారాన్ని తీసుకోవాలన్నారు. హెచ్ఎండీఏలో ప్రత్యామ్నాయ వ‌న‌రులు పెంచ‌డానికి ఔట‌ర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న ఖాళీ భూముల్లో పెట్టుబ‌డులు పెట్టి, టౌన్ షిప్‌ల నిర్మాణం చేప‌ట్టి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ఆర్ధిక వ్యవస్థ అభివృద్దికి హెచ్ఎండీఏ గుండెకాయ‌ లాంటిదన్న విషయాన్ని గుర్తించి అధికారులు పని చేయాలని ఆదేశించారు.

2031 మాస్టార్ ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తరణకు అవకాశమున్న ప్రాంతాల్లో మార్కు చేయాలని ఆదేశింంచారు. దీని ద్వారా మాస్టర్ ప్లాన్ రోడ్లలో ఇండ్ల నిర్మాణం చేయ‌కుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రియ‌ల్టర్లు వెంచ‌ర్లను పూర్తి స్తాయిలో డెవ‌ల‌ప్ చేయ‌కుండ ప్రభుత్వానికి మార్టిగేజ్ చేసిన ప్లాట్లను సైతం రిలీజ్ చేసుకోకుండ నిర్లక్ష్యంగా వ‌దిలేస్తున్నార‌ని, దీంతో ప్లాట్ల‌ను కొనుగోలు చేసిన‌ ప్రజలకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన అధికారులకు గుర్తు చేశారు.

ఇలాంటి ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేక చొర‌వ చూపాలని సూచించారు. మార్టిగేజ్ చేసిన ప్లాట్లను విక్రయించి, ఆ నిధులతో ఆ వెంచర్లలోని డెవలప్ మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కింద 39 లక్షల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని, వాటిని పరిష్కరించే ప్రక్రియను వేగ‌వంతం చేయాల‌ని, సర్కారు నుంచి కావాల్సిన స‌హ‌కారం అందించనున్నట్లు ఆయన వివరించారు.

అలాగే పారిశ్రామిక వాడ‌ల్లో టెండ‌ర్ల ద్వారా భూములు ద‌క్కించుకున్న వారు వాటిని వినియోగించుకుంటున్నారా? లేదా? పరిశీలించి, ఖాళీ గా ఉన్న పక్షంలో వాటిని వెన‌క్కి తీసుకోవాల‌ని ఆదేశించారు. ఇది సాధ్యం కాకుంటే అందులో ప్రభుత్వానికి రావాల్సిన వాట‌ను రాబట్టాల‌ని ఆదేశాలిచ్చారు. హెచ్ఎండీఏ ప‌రిధిలో చెరువుల సంఖ్య ఒక్కో సంద‌ర్భంగా ఒక్కో రకంగా చెబుతున్నారని, అసలు చెరువులు ఎన్ని? వాటిని పునరుద్దరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న విషయాన్ని అధికారులను అడిగి తెల్సుకున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కమిషనర్ రోనాల్డ్ రోస్, సీడీఎంఏ డైరెక్టర్ దివ్య, మెట్రో ఎన్వీఎస్ రెడ్డి్, డిప్యూటీ సీఎం సెక్రెటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed