లాగి చెంప దెబ్బ కొట్టినట్టే ఉంది: MLC దాసోజు

by Gantepaka Srikanth |

లాగి చెంప దెబ్బ కొట్టినట్టే ఉంది: MLC దాసోజు

లాగి చెంప దెబ్బ కొట్టినట్టే ఉంది: MLC దాసోజు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామ పంచాయతీ మొదటి విడత ఫలితాల్లో ఓటర్లు రేవంత్‌రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 2025 పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతున్నాయని.. మొదటి విడతగా 4,236 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు ముగిశాయని.. రేవంత్‌రెడ్డి కోతలకు గ్రామీణ ప్రాంతాల ఓటర్లు వాతలు పెట్టారని తెలిపారు. సాధారణంగా పంచాయతీల్లో అధికార పార్టీకి అనుకూలంగా 90 శాతం ఫలితాలు ఉంటాయని.. రేవంత్‌రెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరిగినా బీఆర్ఎస్ 1,345 సర్పంచ్ స్థానాలు గెల్చుకుందని వెల్లడించారు. కాంగ్రెస్‌కు ఓటర్లు లాగి చెంప దెబ్బ కొట్టినట్టుగా ఈ ఫలితాలు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా లొంగలేదన్నారు. సీఎం ఊరు కొండారెడ్డిపల్లి పక్కన పోల్కంపల్లిలో కాంగ్రెస్‌ను గెలిపించుకోలేకపోయారని పేర్కొన్నారు.

మంత్రి సీతక్క నియోజకవర్గం ఏటూరు నాగారంలో బీఆర్ఎస్ గెలిచిందని, మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళినాయక్ వదిన ఓడిపోయారని పేర్కొన్నారు. ఓటర్లకు పంచిన డబ్బులను తిరిగి రాబట్టుకునేందుకు ఆమె ఇల్లిల్లు తిరుగుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అక్రమాలు చేసి గెలిచిందని.. దేశంలోనే అత్యంత ధనవంతుడైన రేవంత్‌రెడ్డి ఎదిగారని అన్నారు. క్రికెట్ స్టేడియంలో పిచ్ తవ్వేసి ఫుట్ బాల్ నిర్వహించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రేవంత్ జల్సా మ్యాచ్ కోసం వంద కోట్ల ఖర్చా? అని నిలదీశారు. రేవంత్ చేస్తున్న తప్పులకు పంచాయతీ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని.. రెండు, మూడో విడత ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

Next Story