ఎన్ని అక్రమాలు చేసినా ధర్మమే గెలుస్తుంది: BRS

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బోగస్ ఓటింగ్ జరిగిందని.. పోలీసులు బోగస్ ఓటింగ్‌కు సహకరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు.

ఎన్ని అక్రమాలు చేసినా ధర్మమే గెలుస్తుంది: BRS
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బోగస్ ఓటింగ్ జరిగిందని.. పోలీసులు బోగస్ ఓటింగ్‌కు సహకరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం కూడా అక్రమాలకు పాల్పడి కాంగ్రెస్ సహకరించిందని ఆరోపించారు. ఎన్ని అక్రమాలు చేసినా ధర్మమే గెలుస్తుందని చెప్పారు. లెజిస్లేటివ్ ట్రిబ్యునల్‌లో స్పీకర్ సమక్షంలో ఫిరాయింపులపై విచారణ జరుగుతున్నదని.. విచారణ నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం నుంచి ఓ బులెటిన్ విడుదల అయిందని.. సందర్శకులకు, మీడియాపై ఆ బులెటిన్ ద్వారా అసెంబ్లీలోకి ప్రవేశాన్ని నిషేధించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు ప్రవేశాన్ని నిషేధించారని.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారి పార్టీల సభాపక్ష కార్యాలయాల వరకే అనుమతి ఉంటుందని బులెటిన్‌లో పేర్కొన్నారని చెప్పారు. ఈ కేసులో వాదిస్తున్న అడ్వకేట్లను సెల్ ఫోన్లు తీసుకు రావద్దని హుకుం జారీ చేసిందని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఏం గూడుపుఠాణి నడపాలని ఈ బులెటిన్ ద్వారా నిషేధాజ్ఞలు విధించారని ప్రశ్నించారు. ఇది స్పీకర్, రేవంత్ సొంత వ్యవహారం కాదని.. తక్షణమే బులెటిన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ అధికారం చేపట్టాక కోట్ల అప్పులు తెచ్చి పీకింది ఏమీ లేదని విమర్శించారు. కాగ్ డాటా రేవంత్ బట్టలు విప్పేసిందని.. అనుభవం లేని సీఎం ఉంటే ఇంతకంటే ఏం జరుగుతుందని అన్నారు. హైడ్రా పేరిట, ఆర్ఆర్ టాక్స్ పేరిట దోపిడీ చేశారని ఆరోపించారు. ఈ ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ నేతలు సతీష్‌రెడ్డి, హరి రమాదేవి, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

Next Story