రాష్ట్రంలో పేపర్ లెస్ పాలన.. ‘ఈ-ఆఫీస్’ అప్లికేషన్‌ ప్రారంభం : సీవి. ఆనంద్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌లో భాగంగా రాష్ట్రంలో కాగిత రహిత (పేపర్‌ లెస్) పాలనను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవి. ఆనంద్ తెలిపారు.

రాష్ట్రంలో పేపర్ లెస్ పాలన.. ‘ఈ-ఆఫీస్’ అప్లికేషన్‌ ప్రారంభం : సీవి. ఆనంద్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌లో భాగంగా రాష్ట్రంలో కాగిత రహిత (పేపర్‌ లెస్) పాలనను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవి. ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ లక్డీకాపుల్ లోని ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్‌ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టరేట్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన ‘ఈ-ఆఫీస్’ అప్లికేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ-ఆఫీస్ విధానం ద్వారా ఫైళ్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని, పరిపాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ విభాగంలో ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసిన డైరెక్టర్‌ను, సిబ్బందిని ఆయన అభినందించారు. అనంతరం, ప్రాసిక్యూషన్ విభాగం కోసం రూపొందించిన ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ నిర్వహణ వ్యవస్థ’ను ప్రారంభించారు.

ఈ డిజిటల్ విధానం వల్ల సిబ్బంది హాజరులో క్రమశిక్షణ, పారదర్శకత పెరుగుతుందని ఆయన తెలిపారు. ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సి.వి. ఆనంద్ కీలక సూచనలు చేశారు. దేశంలో అమలులోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ చట్టాల అమలుకు సంబంధించి సర్క్యులర్లు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ప్రభుత్వ ఉత్తర్వుల రూపకల్పనలో ప్రాసిక్యూటర్ల బృందం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. కొత్త చట్టాల సమర్థవంతమైన అమలుకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై దిశానిర్దేశం చేశారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎస్. సాంబశివ రెడ్డి విభాగం పనితీరు, సాధించిన విజయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శాఖాపరమైన కొన్ని పెండింగ్ అంశాలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.

Next Story