ముగిసిన కస్టోడియల్ విచారణ.. జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి ప్రభాకర్ రావు రిలీజ్

by Kema Shiva Kumar |

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ప్రధాన నిందితుడు, మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) కస్టోడియల్ విచారణ నిన్నటితో ముగిసింది.

ముగిసిన కస్టోడియల్ విచారణ.. జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి ప్రభాకర్ రావు రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ప్రధాన నిందితుడు, మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) కస్టడీల్ విచారణ నిన్నటితో ముగిసింది. ఈ క్రమంలోనే ఆయనకు సిట్ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి ఇవాళ తెల్లవారుజామున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు. జనవరి 16న కేసుకు సంబంధించి నివేదికను సిట్, సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు డిసెంబర్ 19న ఆయన కస్టడీని నిన్నటి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు డిసెంబర్ 12న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన ప్రభాకర్ రావును 14 రోజుల పాటు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని 9 మంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ (SIT) సుదీర్ఘంగా విచారించింది. ఇక విచారణలో భాగంగా చివరి రోజు కేసులో సహ నిందితులైన ప్రణీత్ రావు, భుజంగ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నలను సిట్‌ జూబ్లీహిల్స్ పీఎస్‌కు పిలిపించి ఒక్కొక్కరుగా ప్రశ్నలు సంధించి కీలక సమాచారాన్ని రాబట్టారు.

నేరుగా సీఎం కార్యాలయానికే ప్రభాకర్ రావు రిపోర్ట్..

విచారణలో భాగంగా ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఎస్‌ఐబీ చీఫ్‌‌గా తన పునర్నియామకంపై సిట్ ప్రశ్నించగా.. ఆ విషయం కేసీఆర్‌ (KCR)నే అడగాలని ప్రభాకర్ రావు చెప్పినట్లుగా తెలుస్తోంది. హరీశ్‌రావును తరచూ ఎందుకు సంప్రదింపులు జరిపావని అడగ్గా.. అందుకు ఆయన హరీశ్‌రావుకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉన్నందున జాగ్రత్తలు చెప్పేందుకు ఆయనతో తరచూ సంప్రదింపులు జరిపినట్లుగా ప్రభాకర్ రావు తెలిపారు. ఇక ఆయన విధినిర్వహణలో భాగంగా ఉన్నతాధికారులకు కాకుండా నేరుగా సీఎం (CM) కార్యాలయానికే రిపోర్ట్ చేసేవారని సిట్‌కు చెప్పినట్లుగా సమాచారం.

సిట్ విచారణపై ఎస్‌ఐబీ చీఫ్‌ విజయ్ కుమార్ సమీక్ష

కాగా, 14 రోజులుగా సిట్ విచారణ జరిగిన నేపథ్యంలో గురువారం రాత్రి ఉన్నతాధికారులు కీలక సమీక్ష నిర్వహించారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌ విజయ్ కుమార్ (Vijay Kumar), సిట్ చీఫ్ సజ్జనార్‌ (Sajjanar)తో పాటు సభ్యులతో సమీక్షించి దర్యాప్తు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖులకు నోటీసుల అంశంపై చర్చకు వచ్చినట్లుగా తెలిసింది. మరోసారి సమీక్షించి ఆ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Next Story