సొంత పార్టీలో విజయశాంతిపై విమర్శలు.. కాంగ్రెస్ శ్రేణులు కోరుకుంటున్నది ఇదే!

by Gantepaka Srikanth |

సినిమాల్లో లేడీ అమితాబ్, రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతిపై సొంత పార్టీ శ్రేణులే నారాజ్‌గా ఉన్నట్టు తెలుస్తున్నది.

సొంత పార్టీలో విజయశాంతిపై విమర్శలు.. కాంగ్రెస్ శ్రేణులు కోరుకుంటున్నది ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సినిమాల్లో లేడీ అమితాబ్, రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతిపై సొంత పార్టీ శ్రేణులే నారాజ్‌గా ఉన్నట్టు తెలుస్తున్నది. గతంలో బీఆర్ఎస్, బీజేపీలో పనిచేసిన ఆమె గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో తిరిగి సొంతగూటికి చేరారు. ఆ తర్వాత పార్టీలో అప్పుడప్పుడు దర్శనం ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో గతం మాదిరిగా యాక్టివ్‌గా ఉండటం లేదని కాంగ్రెస్ శ్రేణులే విమర్శిస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్​బాధ్యతలు చేపట్టాక వచ్చిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా మంది పదవుల కోసం ఆరాటపడ్డారు. చాలా మంది నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, అనూహ్యంగా విజయశాంతి ఆ పోస్టును దక్కించుకున్నారు.

ఊహించినంతగా పనిచేయట్లే..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవిని రాములమ్మకు కాంగ్రెస్ అధిష్టానం కట్టబెట్టాక ఆమె క్రియాశీలక రాజకీయాల్లో కనిపించడం లేదు. విజయశాంతికి ఉన్న ఇమేజ్, సినీ క్రేజ్‌తో పార్టీకి పనికొస్తుందని, ప్రచార కార్యక్రమాల్లో ఆమెకున్న జనాకర్షణ వల్లే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్న ప్రచారం జరిగింది. గతంలో బీజేపీ స్టార్​క్యాంపెనర్‌గా ఆమె ఆ పార్టీ కోసం కష్టపడ్డారు. కాంగ్రెస్‌లో చేరాక అలాగే స్టార్ క్యాంపెనర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తారని పార్టీ శ్రేణులు ఊహించుకున్నారు. కానీ అనుకున్నంతగా క్షేత్రస్థాయిలో ఆమె కనపించడం లేదని హస్తం శ్రేణులే విమర్శిస్తున్నారు. ఇటీవల పొలిటికల్ అంశాలు అనేక వెలుగులోకి వచ్చినా ప్రతిపక్ష పార్టీపై, అధికార పార్టీని కార్నర్ చేసేవారిపై ఆమె విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టలేదని.. కేవలం ట్వీట్లకే పరిమితం అయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని జరిగిన నిరసన సభలో విజయశాంతి పాల్గొన్నారు. ఆ తర్వాత మెదక్, కామారెడ్డిలో భారీ వర్షాలతో సంభవించిన వరదలపై టీపీసీసీ వేసిన ఎమ్మెల్సీ టీంలో ఉన్న ఆమె ఆ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎప్పుడో ఓసారి మీడియాకు ఫేస్ చూపిస్తున్నారు తప్పా ప్రజల్లోకి రావడం లేదన్న అవవాదును మూటగట్టుకున్నారు.

జూబ్లీహిల్స్‌ బైపోల్‌కు విజయశాంతి స్టార్ ఇమేజ్ మైలేజ్..

గతంలో బీఆర్ఎస్‌లో పనిచేసిన విజయశాంతి.. తాజాగా కవిత వివాదం నడుస్తున్న టైంలో ఆమె స్పందిస్తారని, మీడియాతో మాట్లాడుతారని అంతా ఊహించారు. బీజేపీ, బీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పిస్తారని అంతా అనుకుంటే కవిత సస్పెన్షన్‌పై కేవలం ట్వీట్‌కే ఆమె పరిమితం అయ్యారు. రాబోయే జూబ్లీహిల్స్​ఉపఎన్నిక కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం కానుంది. ఈ ఉపఎన్నికల్లో రాములమ్మ పార్టీ కోసం ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో పని చేస్తే పార్టీకి మైలేజ్ వస్తుందన్న ఆశాభావాన్ని సొంత పార్టీ నేతలు వ్యక్తపరుస్తున్నారు. గ్రేటర్​పరిధిలోని జూబ్లీహిల్స్‌లో లేడీ సూపర్​స్టార్‌గా ఆమెకున్న సినీ ఇమేజ్​పార్టీకి కలిసి వస్తుందని కేడర్ భావిస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కాంగ్రెస్‌కు అత్యంత ముఖ్యమైన ఎన్నికలుగా మారాయి. ఈ ఎన్నికల్లో రాములమ్మకు కూడా పార్టీ తరఫున బాధ్యతలు ఇవ్వాలని హస్తం శ్రేణులు కోరుతున్నాయి. ఎమ్మెల్సీ పదవిని పొందినప్పుడు అందుకు అనుగుణంగా పనిచేయాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, లోకల్​బాడీ ఎన్నికల్లో ప్రాధాన్యత పదవి ఇస్తే ఆమె క్షేత్ర స్థాయిలో కనిపిస్తారని హస్తం నేతలు చర్చించుకుంటున్నట్టు తెలిసింది.

Next Story