గ్రూపు-2 ఎగ్జామ్ ఎఫెక్ట్.. సీఎంకు సీపీఎం నేత తమ్మినేని లేఖ

by Disha Web Desk 2 |
గ్రూపు-2 ఎగ్జామ్ ఎఫెక్ట్.. సీఎంకు సీపీఎం నేత తమ్మినేని లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్-2 పరీక్షను కనీసం మూడు నెలలైనా వాయిదా వేయాలని కోరుతూ సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. వరుస పరీక్షలు ఉన్న కారణంగా అభ్యర్థులు గ్రూపు-2 పరీక్షకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని పరీక్షను 3 నెలలు పాటు వాయిదా వేయాలని ఆయన సీఎంను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక ఉద్యోగాల భర్తీ కోసం వరుసగా నోటిఫికేషన్స్‌ ఇచ్చిందని, దీంతో వేర్వేరు పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. గ్రూపు-1 పరీక్షా పేపర్‌ లీక్‌ కావడం వల్ల మళ్ళీ పరీక్ష నిర్వహించారని, దీంతో పాటుగా ఇతర ఇతర పోటీ పరీక్షలకు కూడా ప్రిపేర్‌ అవుతున్నందున సమయం దొరక్క అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. నిర్ణయించిన విధంగానే గ్రూప్‌-2, గురుకుల, జేఎల్‌, డీఎల్‌, పాలిటెక్నిక్‌ లెక్చరర్‌, హాస్టల్‌ వార్డెన్స్‌ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 30 వరకు జరుగుతున్నాయని గుర్తుచేశారు.

వీటిలో ఒక్కో సిలబస్‌ వేర్వేరుగా ఉండడంతో ఏదో ఒక పరీక్షకు మాత్రమే అభ్యర్థులు సన్నదం కావాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. గ్రూప్‌-2 పరీక్షలోని మూడో పేపర్‌ (ఎకానమీ)లో గతంలోని సిలబస్‌కు అదనంగా 70 శాతం కలిపారని.. ప్రిపేర్‌ కావడానికి కొంత సమయం కావాలన్నారు. పేపర్‌ లీకేజీ ఘటనతో మూడు నెలలు మానసిక ఆవేదనతో సరిగా చదవలేకపోతున్నారు. వయస్సు రీత్యా కొంతమంది అభ్యర్థులకు ఇదే చివరి నోటిఫికేషన్‌.. దీనికి తోడు వచ్చే నెలలో టెట్‌ పరీక్ష ఉందని ఆయన తెలిపారు. పరీక్షలు అన్ని ఒకేసారి నిర్వహించడం వల్ల తమకు అర్హతలున్నప్పటికీ ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతున్నామని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గ్రూప్‌-2 పరీక్షను మూడు నెలల పాటు వాయిదా వేసి, వెసులుబాటు కల్పించాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.



Next Story

Most Viewed