నిజాం సరెండర్ అయ్యాడు.. అందుకే మేము సరెండర్ డే అంటున్నాం: CPM

by Disha Web Desk 2 |
నిజాం సరెండర్ అయ్యాడు.. అందుకే మేము సరెండర్ డే అంటున్నాం: CPM
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ, టీఆర్ఎస్ నేతలపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్రలేని బీజేపీ ఓట్ల కోసమే విమోచన దినమంటూ హడావిడి చేస్తోందని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లింల కొట్లాటలుగా బీజేపీ చిత్రీకరిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ తరహా అబద్దాలు, అభూత కల్పనలు, విష ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజానీకాన్ని కోరారు. ఆ పోరాట కాలంలో వారు అసలు ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే బీజేపీ కుట్రల నుండి దేశాన్ని రక్షించుకోవాలంటే మోడీ సర్కారును గద్దె దించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఒకరు విమోచనమని, మరొకరు విలీనమని సాయుధ పోరాటాన్ని రాజకీయాలనికి వాడుకుంటున్నారని మండిపడ్డారు.

నిజాం సరెండర్ అయ్యాడని, అందుకే తాము సరెండర్ డే అంటున్నామని ఏచూరి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వాలు ప్రజా అనుకూల విధాలు తీసుకురావాలని హితవు పలికారు. లౌకిక ప్రత్యామ్నాయ శక్తుల్లో కాంగ్రెస్ కూడా ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ మధ్య గ్యాప్ ఉందని, బెంగాల్‌లో తృణముల్ అన్‌ పాపులర్ అయిందని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని తామూ అంటున్నామని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు కావాలంటాం.. అది రాజ్యాంగంలో లేదని గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీని ఓడించడమే తమ టార్గెట్ అని స్పష్టం చేశారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా అలాగే చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయుధ పోరాటాన్ని బీజేపీ మతపరమైన అంశంగా చిత్రీకరిస్తోందని అన్నారు.


Next Story

Most Viewed