జూబ్లీహిల్స్ బై పోల్‌లో కాంగ్రెస్‌కు సురుకు పెట్టాలె.. మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సురుకు పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

జూబ్లీహిల్స్ బై పోల్‌లో కాంగ్రెస్‌కు సురుకు పెట్టాలె.. మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సురుకు పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ఎర్రగడ్డ డివిజన్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేపటి తెలంగాణ భవిష్యత్తును జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక డిసైడ్ చేస్తుందని కామెంట్ చేశారు. అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసిన రేవంత్ సర్కార్‌కు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం తమకు లేదని ఆ పార్టీ నాయకులు భావిస్తారని అన్నారు. కారు కావాలో కాంగ్రెస్, బీజేపీ బేకారు‌గాల్లు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. తెలంగాణ రక్షగా, గొంతుగా ఉన్న కేసీఆర్‌ను లేకుండా చేయాలన్నదే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి లక్ష్యమని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్‌ను ఖతం చేస్తే కాంగ్రెస్‌ను ఈజీగా ఫుట్‌బాల్ ఆడుకోవచ్చని బీజేపీ భావిస్తుందని అన్నారు. రేవంత్ సర్కార్ చేసిన మోసంతో రాష్ట్రంలో ఏ ఒక్క ఆడబిడ్డ సంతోషంగా లేదని గీతక్క, సీతక్క, సురేఖ అక్కలు మాత్రమే సంతోషంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచరే రేవంత్ ప్రభుత్వమని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ ‘ఓట్‌చోర్’ అంటున్న మోడీని, మోసగాడనే అదానీని రేవంత్ వెనుకేసుకొస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాహుల్ బేకార్ అన్న గుజరాత్ మోడల్‌ను ప్రశంసించిన రేవంత్, వేట కుక్క అన్న సీబీఐని కేసీఆర్ మీదకే ప్రయోగించాడని తెలిపారు. దేశంలోని ముస్లీంల మనోభావాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం చేసిన వక్ఫ్ సవరణలకు వ్యతిరేకంగా రాజ్యసభలో బీఆర్ఎస్ ఓటు వేసిందని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణలను దేశంలో అందరి కంటే ముందు రేవంత్ ప్రభుత్వమే అమలు చేసిందని గుర్తు చేశారు. ఇలా ఎందుకు చేశారో చెప్పాలని.. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ మంత్రులు, నేతలను ముస్లీంలు నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. చరిత్రలో తొలిసారి ముస్లీం మంత్రి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.

Next Story