జూబ్లీహిల్స్ బై పోల్ వేళ బీఆర్ఎస్‍‍కు రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్!

by Prasad Jukanti |   (  Updated:2025-10-29 12:43:29  IST  )

జూబ్లీహిల్స్ బై పోల్ వేళ రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి.

జూబ్లీహిల్స్ బై పోల్ వేళ బీఆర్ఎస్‍‍కు రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్!
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ కేబినెట్ విస్తరణపై (Telangana cabinet expansion) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైంది. మాజీ ఎంపీ, టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను (Mohammed Azharuddin) కేబినెట్‍లోకి తీసుకునేందుకు ఏఐసీసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఎల్లుండి ఉదయం 11 గంటలకు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ హస్తం పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కబోతోందని ‘దిశ’ గతంలోనే చెప్పింది. ‘కేబినెట్‌లోకి అజారుద్దీన్’ అనే శీర్శికతో గత ఆగస్టు 30 ‘దిశ’ డైనమిక్ 5 పీఎం ఎడిషన్‌లో కథనం వెలువరించింది. మైనార్టీలకు, హైదరాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించేలా అధిష్టానం పావులు కదుపుతోదని ఆ కథనంలో పేర్కొంది. సరిగ్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ఇవే సమీకరణాలతో అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయించినట్లు సమాచారం.

ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి..

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, మీర్ అలీఖాన్ పదవులను సుప్రీంకోర్టు గత ఆగస్టులో రద్దు చేసింది. దాంతో ఇదే కోటాలో తిరిగి కోదండరామ్ పేరుతో పాటు అజారుద్దీన్ పేరును ఎమ్మెల్సీలుగా రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదించింది. అయితే ఎమ్మెల్సీగా అజారుద్దీన్ ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన్ను మత్రివర్గంలోకి తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. కాగా, మంత్రివర్గంలో ఇంకా మరో మూడు బెర్త్‌లు ఖాళీగా ఉండగా అందులో ఒకటి మైనార్టీ కోటాలో అజారుద్దీన్ కు కేటాయించబోతున్నారు. మిగతా ఇద్దరిని తర్వాత భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది.

జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌కు మాస్టర్ స్ట్రోక్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుండటం స్టేట్ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ సెగ్మెంట్‌లో గణనీయమైన సంఖ్యలో మైనారిటీ ఓటర్లు ఉన్నారు. దీంతో ఈ వర్గాన్ని తమ వైపు ఆకర్షించేలా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో కెబినెట్‌లో మైనారిటీలకు చోటు లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు చేస్తోంది. ఇక హైదరాబాద్ నుంచి కేబినెట్ లో ప్రాతినిథ్యం లేదు. అలాగే ఎమ్మెల్సీల నుంచి కూడా మంత్రి వర్గంలో చోటు లేదు. ఈ మూడు సమీకరణాల విషయంలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దెబ్బతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనార్టీ ఓటర్లను తమవైపు ఆకర్షించేలా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం ఉందనే చర్చ జరుగుతోంది. నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి రేస్‍లో మొదటి నుంచి అజారుద్దీన్ పేరు వినిపించింది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం అనూహ్యంగా ఆయన్ను తప్పించి ఎమ్మెల్సీగా ప్రతిపాదించింది. ఇప్పుడు ఏకంగా కేబినెట్‌లోకి తీసుకోవాలని నిర్ణయించడంతో మైనార్టీ ఓట్లను సాలిడ్‍గా తమ వైపు తిప్పుకోవడం ద్వారా కారు పార్టీకి భారీగా డ్యామేజ్ చేయబోతోందనే చర్చ జరుగుతోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో అజారుద్దీన్ నిన్ననే ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డిని కలవడం ఆసక్తిగా మారింది.

ఏ శాఖ ఇవ్వబోతున్నారు..?

అయితే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తే ఆయనకు ఏ శాఖ కేటాయించబోతున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే హోం శాఖ, మున్సిపల్, విద్యా శాఖ, వంటి కీలక శాఖలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దే ఉన్నాయి. వీటిలో ఏ శాఖలు కేటాయిస్తారనేది ఉత్కంఠగా మారింది.

Read More... సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన అజారుద్దీన్

Big Breaking News : ఎల్లుండి కేబినెట్ విస్తరణ.. అజారుద్దీన్ కు ఛాన్స్!

Next Story