గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై కాంగ్రెస్ MP సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కంచ గచ్చిబౌలి(Gachibowli)లోని 400 ఎకరాల భూమిపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి(Mallu Ravi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై కాంగ్రెస్ MP సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కంచ గచ్చిబౌలి(Gachibowli)లోని 400 ఎకరాల భూమిపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి(Mallu Ravi) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ భూములపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేయలేదని అన్నారు. కేసు పదేళ్లు పెండింగ్‌లో ఉండటానికి గత ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ కృషితోనే 400 ఎకరాలు ప్రభుత్వానికి వచ్చాయని అన్నారు. కుట్రపూరితంగానే ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీలు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా ఈ అంశంలో సర్కార్‌ను బద్నా చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ పనిచేస్తోందని అన్నారు. వన్యప్రాణులను చంపుతున్నట్లు ప్రచారం చేసిందని తెలిపారు.


బీఆర్ఎస్(BRS) తప్పుడు ప్రచారంతోనే కేంద్ర ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్‌కు వచ్చిందని వెల్లడించారు. ఎంపవర్డ్ కమిటీ కూడా ఆ భూమి ప్రభుత్వానిదే అనే నిర్ధారణకు వచ్చిందని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ హైకమాండ్‌కు వాస్తవాలతో కూడిన నివేదికను పంపినట్లు తెలిపారు. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌కు కూడా వివరాలు పంపినట్లు చెప్పారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే లక్ష్యంతో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారు.. పోలీసులు అప్రమత్తమై కేసులు పెడుతుంటే తొలగిస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు ఆ 400 ఎకరాలను ఏ రియల్ ఏస్టేట్ కంపెనీకి ఇవ్వలేదని స్పష్టం చేశారు.

అక్కడ ఐటీ కంపెనీలు నెలకొల్పి వేలాది మంది నిరుద్యోగులకు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఫ్యూచర్ సిటీతో నగరంపై చాలా వరకు ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. ఆర్ఆర్ఆర్(Regional Ring Road) కోసం ఇప్పటికే 12 సార్లు ప్రధాని నరేంద్ర మోడీని కలిశామని అన్నారు. అతి త్వరలోనే ఆర్ఆర్ఆర్ పనులకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఓఆర్ఆర్ - ఆర్ఆర్ఆర్ మధ్య టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. రేవంత్ ప్రభుత్వ అభివృద్ధి చూసి ఓర్వలేక బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యారని విమర్శించారు. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు.

Next Story