కాంగ్రెస్ MLC అద్దంకి దయాకర్ కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-07 16:16:46  IST  )

ఎమ్మెల్సీగా అందుకునే వేతనం నుంచి 25 శాతాన్ని పార్టీ ఫండ్, మరో 25 శాతం ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు అందజేస్తానని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కీలక ప్రకటన చేశారు.

కాంగ్రెస్ MLC అద్దంకి దయాకర్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీగా అందుకునే వేతనం నుంచి 25 శాతాన్ని పార్టీ ఫండ్, మరో 25 శాతం ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు అందజేస్తానని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కీలక ప్రకటన చేశారు. సోమవారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇకపై తాను ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తానని,ప్రజల కష్టాలన్నీ తెలుసు అని అన్నారు. అందుకే తాను, భార్య నాగమణి కలిసి ఎమ్మెల్సీగా వచ్చే నగదులో పార్టీ ఫండ్, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీనిని అతి త్వరలోనే అమలు చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు.

ఏఐసీసీ పెద్దలు సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్సీ అయ్యానని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టాక పార్టీలో మంచి మార్పులు వచ్చాయన్నారు. దళిత కుటుంబం నుంచి వచ్చిన తనకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని, ప్రజలకు, పార్టీకి కట్టుబడి ఉంటానని అద్దంకి దయాకర్​స్పష్టం చేశారు.

Next Story