Yennam Srinivas Reddy: బహుజనులందరూ బతుకమ్మ ఆడలే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపంపై కాగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Yennam Srinivas Reddy:  బహుజనులందరూ బతుకమ్మ ఆడలే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో బహుజనులు బతుకమ్మ ఆడలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డితో పాటు అనేక ప్రాంతాల్లో చాలా మంది బహుజనులు ఎక్కువగా ఇష్టపడి పాల్గొనేది బోనాల పండగ అన్నారు. తెలంగాణ ఉద్యమం (Telangana Movement) మొదలైనప్పుడు బతుకమ్మను అందరూ ఆడారన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. ఒక పండగ ఒకరిది మరొక పండగ మరొకరిది అనే భావన ఉండవద్దని కేవలం ఒక పండగకే తెలంగాణ ప్రతీక అనే భావన సరికాదనే అమ్మ ఆశీర్వాదం ఇస్తుందని, ప్రజల కడుపు నింపుతుందనే భావన కలిగించేలా తెలంగాణ తల్లి విగ్రహానికి (Telangana Mother Statue) అభయహస్త రూపాన్ని ఇచ్చామన్నారు. ఎవరినో కించపరిచాలనో ఏ పండగనో కించపరచాలనే ఉద్దేశం కాదన్నారు. నిజానికి మొత్తం బహుజనులకు ప్రతిరూపమే ఈ తెలంగాణ తల్లి స్వరూపం అన్నారు.

గడిచిన పదేళ్లు తెలంగాణ తల్లి రూపం, ఆవిష్కరణ గురించి ఎలాంటి ప్రక్రియ లేకుండా త్రిశంకు స్వర్గంలో తెలంగాణ తల్లిని పెట్టారన్నారని విమర్శించారు. ఉద్యమ సమయంలో తెలుగు తల్లి విగ్రహం ఉన్నట్లుగానే మనకూ ఓ తల్లి విగ్రహం కావాలని కేసీఆర్ తెలంగాణ తల్లికి రూపకల్పన చేశారు. కానీ ఆ రూపం సమస్త తెలంగాణ జాతికి ఆమోదయోగ్యం కాదని అనేక మంది మేధావులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. స్వరాష్ట్రం వచ్చాక రాష్ట్ర గీతాన్ని, తెలంగాణ తల్లి విగ్రహరూపాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిష్కరించలేదు. కానీ కేసీఆర్ (KCR) లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ఈ పదేళ్లు చిల్లర మాటలు చెప్పారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రజల భావోద్వేగంతో కూడుకున్న ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు సభలో లేకపోవడం తెలంగాణ జాతికి కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న ద్రోహంగా పరిగణించాలన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ (BRS) డొల్లతనం బయటపడిందని, పార్టీ పేరులోనే తెలంగాణ పదాన్ని తొలగించిన బీఆర్ఎస్ కు తెలంగాణ తల్లి విగ్రహం గురించి ప్రశ్నించే నైతికత ఎక్కడిదని నిలదీశారు. అసెంబ్లీకి రాని కేసీఆర్.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరై తెలంగాణ పట్ల మీకు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.

Next Story