రామ్ గోపాల్ వర్మపై కాంగ్రెస్ నేత విహెచ్ ఫైర్

by Disha Web Desk 12 |
రామ్ గోపాల్ వర్మపై కాంగ్రెస్ నేత విహెచ్ ఫైర్
X

దిశ ప్రతినిధి నిర్మల్: నాగార్జున యూనివర్సిటీలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు. అసలు వర్మకు సెన్స్ ఉందా అని ప్రశ్నించారు. గురువారం ఆయన నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళలు అంటే కనీస గౌరవం లేకుండా సెక్స్ శృంగారం ఫుడ్ మూడింటికే మహిళలు అవసరం అవుతారన్నట్టుగా రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. మహిళలు అంటే అంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు.

ప్రపంచంలో మగ జాతి అంతా నశించిపోయి తాను ఒక్కడినే ఉంటానని చెప్పడం, మహిళలందరికీ అప్పుడు నేనే దిక్కు అన్నట్లుగా వ్యాఖ్యానించడంపై వీహెచ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. వెంటనే ఆయన మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని.. లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు స్పందించాలని వర్మ వ్యాఖ్యలను పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని రాజకీయ రంగంలోనూ వారికి పెద్దపీట వేయాలన్న ఆలోచనతో రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని గుర్తు చేశారు.

సోనియాకు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు..

తెలంగాణ ఉద్యమ సమయంలో యువత ఆత్మహత్యలు చూసి చలించిపోయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తమను గెలిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తున్నట్లు చెప్పి ఆ హామీని నిలబెట్టుకున్నారని హనుమంతరావు గుర్తు చేశారు. తెలంగాణ ఇస్తే తాము అధికారంలోకి వస్తామని ఆ రోజు సోనియాకు ఇచ్చిన హామీని మాత్రం తామే నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ కాంగ్రెస్ రావాలంటే రాష్ట్రంలో తమ నేతలందరూ కలవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చేపట్టిన జోడో పాదయాత్ర ఆయనకు ఎంతో నేర్పిందని చెప్పారు.

లండన్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన అంశాలన్నీ వాస్తవాలేనని చెప్పారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతుందని రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు వాస్తవమేనన్నారు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ వాళ్లు ఏది మాట్లాడినా తప్పు అన్నట్టుగా మోడీ ఏది మాట్లాడినా నిజమే అన్నట్టుగా బీజేపీ సమాజాన్ని తప్పుడు పట్టిస్తుందని.. దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన జోడో యాత్రకు సంఘీభావం తెలిపేందుకు ఆయనతో కలిసి నడిచేందుకు వెళుతున్నట్లు హనుమంతరావు వెల్లడించారు.


Next Story

Most Viewed