జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జోరు

by Malleboina Mahesh |

జూబ్లీహిల్స్​ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్​పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా మంత్రులు ప్రచారంలో నిర్వహిస్తున్నారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జోరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్​ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్​పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా మంత్రులు ప్రచారంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు మంత్రులను ఇన్చార్జిలుగా నియమించిన కాంగ్రెస్​మిగతా మంత్రులకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఇక నియోజకవర్గంలో నేతలు పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలు చేస్తూ ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్​యాదవ్​పైన బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు తిప్పికొడుతూ ప్రజలకు వివరిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరణ ముగియడంతో సీఎం రేవంత్​రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రచారంలో వేగం పెంచాలని ఆదేశించారు.

ప్రతి డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పున 13 మందికి ప్రచార బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. మంత్రితో పాటు నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఆరుగురు కార్పొరేషన్ చైర్మన్లు ఒక బృందంగా ప్రచార బాధ్యతలు చేపట్టారు. కాగా, ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి, టీపీసీసీ చీఫ్​ మహేష్ కుమార్ గౌడ్, వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ శనివారం సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్​ఎన్నిక ప్రచార తీరు, వ్యూహాలను చర్చించినట్లు సమాచారం.

గల్లీ గల్లీకి మంత్రులు

కాంగ్రెస్​అభ్యర్థి నవీన్ యాదవ్​ను గెలిపించాలని కోరుతూ మంత్రి సీతక్క శనివారం బోరబండలో దోశలు వేసి వినూత్న రీతిలో ప్రచారం చేశారు. యూసుఫ్​గూడలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో నడిపి ఓట్లు అభ్యర్థించారు. షేక్​పేట డివిజన్ లో మంత్రి వివేక్​ఇంటింటి ప్రచారం చేశారు. అలాగే ఎర్రగడ్డ రైతు బజార్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎర్రగడ్డ డివిజన్ కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యక‌ర్తల‌తో స‌మావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో స‌మష్టిగా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని దిశానిర్దేశం చేశారు.

Next Story