ఎగ్జిట్ పోల్స్‌తో పెరిగిన జోష్.. గెలిస్తే రికార్డే

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-12 02:42:41  IST  )

జూబ్లీహిల్స్​లో ఉపఎన్నికలో విజయంపై కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఎగ్జిట్​పోల్స్​తమకే అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నది.

ఎగ్జిట్ పోల్స్‌తో పెరిగిన జోష్.. గెలిస్తే రికార్డే
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్​లో ఉపఎన్నికలో విజయంపై కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఎగ్జిట్​పోల్స్​తమకే అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నది. గెలుపు కోసం సమష్టిగా వ్యూహాలను అమలు చేస్తూ ఓటర్ల వద్దకు వెళ్లింది. అయితే కాంగ్రెస్​2009లో మాత్రమే ఇక్కడ గెలిచింది. ఆ ఎన్నికల్లో దివంగత పీజేఆర్ కుమారుడు పి.విష్ణువర్థన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆ పార్టీ​విజయం సాధించలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​నుంచి పోటీచేసిన అజారుద్దీన్​బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. అజారుద్దీన్​63వేలకు పైగా ఓట్లు సాధించారు. సుమారు 16ఏళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్​విజయం సాధించిన ట్రాక్​రికార్డు లేదు. అలాంటి నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఉపఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో గెలవడం​పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా గ్రేటర్​పరిధిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత కంటోన్మెంట్​నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లో స్వల్పతేడాతో దానం నాగేందర్ ఓడిపోయారు. ఇటు గ్రేటర్​పరిధిలోకి వచ్చే మల్కాజ్ గిరి, చేవెళ్ల ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో సత్తాచాటాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇక్కడ గెలిస్తే బూస్ట్!

సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సలహాలు, సూచనలు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమలు చేశారు. మంత్రులను డివిజన్ల వారీగా ఇన్ చార్జిలను నియమించి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ముఖ్యనేతలను ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నం చేయడంలో కాంగ్రెస్​సక్సెస్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు షోలు, మంత్రులు, నాయకుల ఇంటింటి ప్రచారాలు, సర్వేలు చేయిస్తూ ఎన్నికల వ్యూహాలను అమలు చేయించడంలో మహేశ్ కుమార్ గౌడ్ సఫలీకృతమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పోలింగ్​సైతం 50శాతం దాకా ఉంటుందన్న అంచనాల్లో నేతలు ఉన్నారు. ఎన్నికల పోలింగ్​ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్​పోల్స్​లో అన్ని సర్వేలు కాంగ్రెస్​పార్టీకి అనుకూలంగా వచ్చాయి. దీంతో అధికారపార్టీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. క్లిష్టమైన సమయంలో వచ్చిన ఈ ఉపఎన్నికలో విజయం సాధిస్తే వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి బూస్ట్ వస్తుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Next Story