Congress: యాక్షన్ షురూ..! ఆ సెగ్మెంట్లపై మీనాక్షి స్పెషల్ ఫోకస్

by Kema Shiva Kumar |

కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్​ పార్లమెంటు సెగ్మెంట్లపై ఫోకస్​పెట్టారు.

Congress: యాక్షన్ షురూ..! ఆ సెగ్మెంట్లపై మీనాక్షి స్పెషల్ ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్​ పార్లమెంటు సెగ్మెంట్లపై ఫోకస్​ పెట్టారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా భేటీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆయా సెగ్మెంట్ల ముఖ్యనేతలను పిలిచి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని మీనాక్షి భావిస్తున్నారు. ఇందుకోసం సమావేశాలు జరపాలని ఆమె నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​గౌడ్​అధ్యక్షతన గాంధీ భవన్‌లో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయనున్నారు.

పాత, కొత్త లీడర్ల మధ్య సమన్వయంపై దృష్టి

ప్రధానంగా ఏయే సెగ్మెంట్లలో పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు., ఎవరెవరు వర్గాలను పోషిస్తూ వస్తున్నారు?.. ఎవరు వివాదాలకు కారణమవుతున్నారనే దానిపై సమాచారం సేకరించాలని మీనాక్షి పీసీసీకి సూచించినట్టు తెలిసింది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన లీడర్లు, పార్టీలో కొనసాగుతున్న పాత వారికి మధ్య సఖ్యత వంటి విషయాలపై తనకు తెలపాలని చెప్పినట్టు సమాచారం. అలాంటి వారిని సమన్వయం చేయడంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు.

పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు..

నేతలు వర్గపోరును వదిలి పార్టీ బలోపేతానికి కృషి చేసేలా ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని ఉద్దేశంతో.. నేతలతో ఇంటరాక్ట్​కావాలని మీనాక్షి నటరాజన్​ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. గతంలో జిల్లాలు, వర్గాల వారీగా నేతలు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జిని కలిసి తమ అభిప్రాయాలు, కావాల్సిన వాటి గురించి చెప్పుకునేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్​యాక్షన్‌లోకి దిగనున్నారని పార్టీ వర్గీయుల సమాచారం.

టీపీసీసీలో భారీ మార్పులు!

అంతా కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అలా కాకుండా నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన నిర్ణయం తీసుకోవాలని మీనాక్షి పీసీసీకి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. పైరవీలు, పలుకుబడితో పోస్టులు ఇచ్చే విధానం కూడా ఉండబోదని మీనాక్షి చెప్పినట్టు సమాచారం. నూతంగా తెలంగాణ ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె తొలుత గత నెల 28వ తేదీన గాంధీ భవన్‌లో నిర్వహించిన టీపీసీసీ విస్తృత స్థాయి మీటింగ్‌లో పాల్గొన్నారు. ఫస్ట్​మీటింగ్‌లోనే మీనాక్షి తన మార్క్‌ను చూపించారు. ఆడంబరాలకు దూరంగా ఉండే వ్యక్తినని, తన దృష్టిలో పడటం కన్న పార్టీ కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్​రాకతో టీపీసీసీలో భారీగా మార్పులు రానున్నాయని ఆ పార్టీ వర్గీయులే చెబుతున్నారు.

రేపు మెదక్, మల్కాజిగిరి నేతలతో భేటీ..

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ మెదక్, మల్కాజిగిరి పార్లమెంటు​నియోజకవర్గాల పరిధిలోని నేతలతో భేటీ కానున్నారు. మంగళవారం గాంధీ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు మెదక్, సాయంత్రం 5 గంటలకు మల్కాజిగిరి పార్లమెంటు సెగ్మెంట్ల లీడర్లతో సమావేశం కానున్నట్టు టీపీసీసీ తెలిపింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ అధ్యక్షతన జరిగే మీటింగ్‌లో మీనాక్షి నటరాజన్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలోని మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ పాల్గొనాలని టీపీసీసీ విజ్ఞప్తి చేసింది.

Next Story