మునుగోడులో కమ్యూనిస్టు క్యాడర్ అలక.. ఓట్లకు గండి పడే అవకాశం?

by Disha Web Desk 2 |
మునుగోడులో కమ్యూనిస్టు క్యాడర్ అలక.. ఓట్లకు గండి పడే అవకాశం?
X

దిశ సంస్థాన్ నారాయణపురం: మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమ పట్టును సాధించుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్ష పార్టీల మద్దతు ఉంటే ఈజీగా తాము గెలుస్తామని పార్టీ అధినాయకత్వం ఇప్పటికే వామపక్ష పార్టీల మద్దతును కూడా గట్టింది. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో తమ గెలుపును ఎవరూ ఆపలేరనే ధీమాలో టీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఉంది. కానీ స్థానిక నేతల తీరుతో టీఆర్ఎస్ పార్టీ ఓట్లకు గండిపడుతుందేమో అన్న అనుమానం కలగక మానదు.

పార్టీ కార్యక్రమాలకు కమ్యూనిస్టు క్యాడర్‌కు సమాచారం కరువు

స్థానిక టీఆర్ఎస్ నేతలు నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు కమ్యూనిస్టు క్యాడర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని స్థానిక కమ్యూనిస్టు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకున్న మిత్ర ధర్మాన్ని పాటిస్తామని, కానీ స్థానిక టీఆర్ఎస్ నేతల తీరు తమను అసంతృప్తికి గురి చేస్తుందని పలువురు కమ్యూనిస్టు కార్యకర్తలు తమమనసులో మాటను బయటపెట్టారు. స్థానికంగా వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జిలో తమ అనుచర గణంతో పాటు స్థానిక టీఆర్ఎస్ నేతలు ఇద్దరితో కలిపి 100 మంది ఓటర్లకు నలుగురిని బాధ్యులుగా నియమించిన విషయం తెలిసిందే. కానీ ఇందులో కమ్యూనిస్టు కేడర్ ఉన్నా తమ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి బాధ్యతలు అప్పగించడం లేదని వారు వాపోతున్నారు. పార్టీలో క్రియాశీలంగా పనిచేసే క్యాడర్‌కు ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుంటే తమ ఓటర్లకు ఏం సమాధానం చెప్పాలని మండల పరిధిలో ఓ గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నేత తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇకనైనా కమ్యూనిస్టు క్యాడర్‌ను కలుపుకుని పోవాలని లేనట్లయితే అది టీఆర్ఎస్ అభ్యర్థి విజయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయని కమ్యూనిస్టు కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

సమన్వయ కమిటీలు వేసినా ఫలితం శూన్యం!

సంస్థాన్ నారాయణపురం మండలంలో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పార్టీలతో కలిపి సుమారు 18 మందితో కలిపి మండల స్థాయిలో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అన్ని పార్టీల నాయకులను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రామ స్థాయిలో గ్రామ శాఖలతో సంప్రదించి తమ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉన్నా కామ్రేడ్లకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆ పార్టీ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థి గెలవక ముందే తమను పరిగణలోకి తీసుకోకుండా చులకన చేస్తుండడంతో అభ్యర్థి గెలిచాక టీఆర్ఎస్ కార్యకర్తలు తమను పట్టించుకుంటారో లేదో అనే సందేహం కామ్రేడ్లలో మొదలైంది. దీంతో పలువురు కమ్యూనిస్టు కార్యకర్తలు పిలవని పేరంటానికి వెళ్లి ఎందుకు ఇబ్బందులు పడటం అని మండల స్థాయి లీడర్ల వద్ద అంటున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed