ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు.. కంటిన్యూ అయితే ఉద్యోగం ఊస్టే

by Disha Web Desk 2 |
ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు.. కంటిన్యూ అయితే ఉద్యోగం ఊస్టే
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని, తెలంగాణ ప్రభుత్వం సరిపడ విద్యుత్ సరఫరా చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స‌చివాల‌యంలో గృహ‌జ్యోతి, రూ.500కే సిలిండ‌ర్ పథకాలపై గురువారం నిర్వహించిన స‌మీక్షకు ముందు సీఎం విద్యుత్ కోత‌ల‌పై సాగుతున్న ప్రచారంపై అధికారుల‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరపున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటంలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా భారీగా పెరిగిందని చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, విద్యుత్ శాఖపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అటువంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గ‌తంతో పోల్చితే విద్యుత్ స‌ర‌ఫ‌రా పెంచినప్పటికీ, కోత‌లు పెడుతున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపైనే ఉందన్నారు. గ‌తేడాదితో పోల్చితే గ‌త రెండు నెల‌ల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా ఎక్కువ‌గా చేసినట్లు ట్రాన్స్ కో, జెన్​కో సీఎండీ రిజ్వీ సమాధానమిచ్చారు. ఇటీవ‌ల రాష్ట్రంలో మూడు సబ్ స్టేషన్ల ప‌రిధిలో కొంత సేపు విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింద‌ని తెలిపారు. దానికి కార‌ణాలు ఏమిట‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సబ్ స్టేషన్లలో లోడ్ హెచ్చుతగ్గులను డీఈలు స‌రి చూసుకుంటూ ఉండాల‌ని, అలా చూసుకోక‌పోవ‌డంతో స‌మ‌స్య త‌లెత్తింద‌ని అధికారులు తెలియ‌జేశారు.

నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై క‌ఠిన చర్యలు తీసుకోవాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏవైనా మరమ్మతులు, ఇత‌ర అంశాల‌కు స‌ర‌ఫ‌రా నిలిపివేయాల్సి వ‌స్తే ముందుగానే ఆయా సబ్ స్టేషన్ల ప‌రిధిలోని వినియోగ‌దారుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు. గ‌త ప్రభుత్వ హ‌యాంలో నియ‌మితులైన కొంద‌రు క్షేత్రస్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ఉద్దేశ్యపూర్వకంగా కోత‌లు పెడుతున్నార‌నే స‌మ‌చారం తమకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎక్కడైనా సరే.. ఐదు నిమిషాల‌కు మించి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోతే అందుకు గ‌ల కార‌ణాల‌పై వెంట‌నే స‌మీక్షించుకోవాలని సూచించారు. సాంకేతిక‌, ప్రకృతిప‌ర‌మైన కార‌ణాలు మిన‌హా ఉద్దేశ‌పూర్వకంగా ఎవ‌రైనా కోత‌ల‌కు కార‌ణ‌మైతే వారిపై చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు.

రాష్ట్రంలో డిమాండ్‌కు అనుగుణంగా సరిపడేంత విద్యుత్ ను అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. విద్యుత్ అవసరం ఎక్కువగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ పీక్ సీజన్ కు సరిపడేంత విద్యుత్‌ను అందించే కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసుకుందన్నారు. ఫిబ్రవరిలో ఒకటో తేదీ నుంచి 13వ తేదీ వరకు రోజుకు 264.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అయిందన్నారు. ఏడాది అదే వ్యవధిలో 242.44 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా జరిగిందని, గతేడాది జనవరిలో 230.54 మిలియన్ యూనిట్లు సరఫరా కాగా, ఈ ఏడాది జనవరిలో అంతకంటే ఎక్కువగా 243.12 మిలియన్ యూనిట్లు సరఫరా అయింనట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed