వేసవిలో నీటి ప్రాబ్లమ్ ఉండకూడదు.. సమీక్షలో సీఎం రేవంత్

by Disha Web Desk 2 |
వేసవిలో నీటి ప్రాబ్లమ్ ఉండకూడదు.. సమీక్షలో సీఎం రేవంత్
X

దిశ, సిటీ బ్యూరో: వేస‌వి కాలంలో తాగునీటికి ఢోకా లేదని, ఇప్పటికే ఇందుకు అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలతో కార్యచరణను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అధికారులను ఆదేశించారు. వ‌ర్షాభావంతో జ‌లాశ‌యాలు డెడ్‌స్టోరేజీకి చేరుకున్న నేప‌థ్యంలో తాగునీటి స‌ర‌ఫ‌రాలో ఎదుర‌య్యే స‌మ‌స్యలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చ‌ర్యలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డితో క‌లిసి సాగు నీరు, ప‌ట్టణాభివృద్ధి, పుర‌పాల‌క‌, పంచాయ‌తీరాజ్‌, తాగు నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల అధికారుల‌తో గురువారం స‌మీక్ష నిర్వహించారు. తొలుత రాష్ట్రంలో జ‌లాశ‌యాల్లో నీటి నిల్వలు, తాగు నీటికి అవ‌స‌ర‌మైన నీటి ప‌రిమాణంపై అధికారులు గ‌ణాంకాలు వివ‌రించారు. అనంత‌రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ న‌గ‌రాలు, పట్టణాలు, ప‌ల్లెలు, తండాలు, గూడేంలు, ఎస్సీ కాల‌నీలు అనే తేడా లేకుండా ప్రతి నివాస ప్రాంతానికి తాగు, సాగు నీరు అందేలా ప‌ట్టణాభివృద్ధి, పుర‌పాల‌క‌, పంచాయ‌తీరాజ్‌, తాగు నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌లు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్రణాళికలను రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

తాగు నీటి కోసమంటూ నాగార్జున సాగ‌ర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్ 9 టీఎంసీల‌కుపైగా నీరు తీసుకుపోతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అంత పెద్ద మొత్తంలో తాగు నీరు ఎక్కడ వినియోగిస్తున్నార‌ని, స‌రైన గ‌ణాంకాలు తీసుకొని ఇతర అవసరాలకు నీరు తీసుకుపోకుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. నాగార్జున సాగ‌ర్‌, శ్రీ‌శైలం ప్రాజెక్టుల నుంచి తాగు నీటికి నీరు తీసుకోవాలంటే కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డుకు (కేఆర్ఎంబీ) లేఖ రాయాల్సి ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. ఎంత నీరు అవ‌స‌ర‌మో స‌మ‌గ్రంగా స‌మీక్షించి వెంట‌నే కేఆర్ఎంబీకి లేఖ రాయాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ‌తంలో ఏప్రిల్ నెలాఖ‌రు, మే నెల‌లో వ‌చ్చిన వ‌ర్షాల‌తో జూరాల‌కు నీరు రావ‌డంతో ఇబ్బంది రాలేద‌ని, లేకుంటే నారాయ‌ణ‌పూర్ జ‌లాశ‌యం నీరు విడుద‌ల కోరుతూ క‌ర్ణాట‌క‌ను అభ్యర్థించాల్సి ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. గ‌తంలో ఎప్పుడైనా అలా తీసుకున్నారా? అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించగా, మూడేళ్ల క్రితం తీసుకున్నామ‌ని అధికారులు సమాధానమిచ్చారు. అయితే దానిని చివ‌రి అవ‌కాశంగా తీసుకోవాల‌ని ముఖ్యమంత్రి సూచించారు. ముందుగా కేఆర్ఎంబీకి లేఖ రాయాల‌ని ఆదేశించారు.



Next Story

Most Viewed