కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు.. అలా అని అందరినీ దోషులు అనలేం కదా: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ధరణి పోర్టల్‌(Dharani Portal)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు.. అలా అని అందరినీ దోషులు అనలేం కదా: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ధరణి పోర్టల్‌(Dharani Portal)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పేదల పాలిట శాపంగా ఉండేదని అన్నారు. ధరణితో గత ప్రభుత్వం చేయాల్సినన్ని అక్రమాలు చేసిందని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ను గొప్పగా తీసుకొచ్చి రెవెన్యూ సిబ్బందిని దొంగలుగా, దోపిడీదారులుగా చిత్రీకరించారని మండిపడ్డారు. ఏ శాఖలోనైనా కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటే ఉండొచ్చు.. అలా అని అందరినీ దోషులుగా నిలబెడతామా? అని ప్రశ్నించారు. ఇంట్లో ఎలుక వస్తే ఇల్లంతా తగలబెట్టుకుంటామా..? అని అన్నారు. గత ప్రభుత్వం చట్టాలును మార్చి కొందరికి చుట్టాలుగా మార్చిందని విమర్శించారు. ఆనాడు తెచ్చిన ధరణి తెలంగాణ ప్రజలకు పీడకలగా మారింది.. రెవెన్యూ సిబ్బందిపై నెపం వేసి లబ్ధి పొందాలని చూశారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

పండుగ వాతావరణంలో భూభారతిని ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. భూభారతి(Bhu Bharathi Porta) ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దళితులకు, గిరిజనులకు కాంగ్రెస్ భూములు పంచిందని గుర్తుచేశారు. భూమి కోసం గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి.. పోరాటాల నుంచి రెవెన్యూ చట్టాలు వచ్చాయని తెలిపారు. ధరణితో ఒక ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితులు చూశామని చెప్పారు. అంతకుముందు ‘భూభారతి’ పోర్టల్‌‌ను హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Next Story