కాళేశ్వరంలో CM రేవంత్ సంచలన శపథం.. కేసీఆర్, జీవన్ రెడ్డి ఇద్దరిపైనా నిప్పులు

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-20 15:29:38  IST  )

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, రాజకీయ మార్పులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యుద్ధం ప్రకటించారు.

కాళేశ్వరంలో CM రేవంత్ సంచలన శపథం.. కేసీఆర్, జీవన్ రెడ్డి ఇద్దరిపైనా నిప్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, రాజకీయ మార్పులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యుద్ధం ప్రకటించారు. మేడిగడ్డ సందర్శన అనంతరం నస్తూర్‌పల్లి బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ మారిన జీవన్ రెడ్డిపై మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడ్డారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో ఒక మాదిగ బిడ్డ అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి ఇస్తే ఓర్వలేకనే జీవన్ రెడ్డి పార్టీ మారారు. కాంగ్రెస్ ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చినా, కుట్రపూరితంగా బీఆర్ఎస్‌లో చేరారు అని మండిపడ్డారు. వచ్చేసారి కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తా.. అప్పుడు జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారో చూస్తా అని ఎద్దేవా చేశారు. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే అది కొన్ని నెలల్లోనే కూలేశ్వరం అయింది. తెలంగాణను పదేళ్లు లూటీ చేసిన కేసీఆర్‌ను ఉరి తీసినా తప్పులేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

భ్రమల్లో కేసీఆర్..

మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ భ్రమల్లో ఉన్నారని, ఆ కుటుంబాన్ని ఎప్పటికీ అధికారంలోకి రానివ్వనని శపథం చేశారు. రాబోయే ఎన్నికల ఫలితాలపై రేవంత్ రెడ్డి స్పష్టమైన సవాల్ విసిరారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఘోరీ కట్టామని, 2029లో కూడా అదే పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డి.శ్రీనివాస్ కలిసి కాంగ్రెస్‌ను ఎలా అధికారంలోకి తెచ్చారో.. ఇప్పుడు నేను, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కలిసి రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తాం అని కార్యకర్తల సాక్షిగా ప్రకటించారు. పాలకుల చిల్లర మాటలు అంటూ కేసీఆర్ చేసిన విమర్శలకు, రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

కేసీఆర్ నోట మళ్ళీ TRS మాట: అధికారంలోకి రాగానే ఎత్తిపారేస్తామని ప్రకటన

Next Story